ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, ఆయన కుమారుడు గౌతమ్ తిన్ననూరి రాజా తాత మనవాళ్ళుగా నటించిన బ్రహ్మ ఆనందం సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, “నేను మళ్ళీ రాజకీయాలలోకి రాబోతున్నానని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ జన్మలో మళ్ళీ రాజకీయాలలోకి రాను. నా రాజకీయ ఆశయాలను, నేను చేయాలనుకున్న పనులని నా తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్, నాగబాబు చేస్తున్నారు. కనుక ఆ బాధ్యతలు వారే చూసుకుంటారు. నన్ను ప్రజలు ఆదరిస్తున్నంత వరకు సినిమాలలో నటిస్తాను,” అని తేల్చి చెప్పేశారు.
చిరంజీవి ప్రజారాజ్యంతో రాజకీయాలలోకి వచ్చి చెయ్యి కాల్చుకుని మళ్ళీ సినీ పరిశ్రమలోకి తిరిగి వెళ్ళిపోయారు. ఆయన రాజకీయాలు వీడిన తర్వాత ఏనాడూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేదు. కానీ ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటుంది.
మెగాస్టార్గా ఆయనకున్న ప్రజాధరణ, లక్షలాది మంది అభిమానుల కారణంగా అన్ని పార్టీలు ఏదోవిదంగా ఆయనని ప్రసన్నం చేసుకొని మావాడు అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నాయి. నేను అందరివాడినే కానీ ఏ పార్టీవాడినీ కానని మరోసారి చిరంజీవి తేల్చి చెప్పేయడం మంచిదే.
ఎందువల్ల అంటే, ఆయన జనసేనలో చేరితే ‘కుటుంబ రాజకీయాలు’ ముద్ర పడుతుంది. కాంగ్రెస్లో కొనసాగితే బీజేపి, జనసేన, టీడీపీలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. బీజేపిలో చేరితే అందరివాడుగా ఉన్న ఆయనపై మతతత్వ ముద్ర పడుతుంది. మైనార్టీలు, ఆ వర్గానికి చెందిన అభిమానులు దూరం అవుతారు.
ఒకవేళ ఏదో ఓ పార్టీలో చేరినా రాజకీయాలలో ఇమడలేక మళ్ళీ బయటకు వస్తే నవ్వుల పాలవుతారు.
ఆయన ప్రజారాజ్యంతో విజయం సాధించి ఉంటే అది ఆయనకు, తమ్ముళ్ళకు, అభిమానులకు అందరికీ గర్వంగా ఉండేది. కానీ ఏదో ఓ పార్టీలో చేరి రెండో లేదా మరేదో స్థానంలో ఉంటే అంత గౌరవం లభించదు. సినీ పరిశ్రమలో పెద్దన్నగా, మెగాస్టార్గా కొనసాగడమే ఆయనకు గౌరవంగా ఉంటుంది. కనుక రాజకీయాలకు దూరంగా ఉండాలనుకోవడం చాలా మంచి నిర్ణయమే.




