తన 150వ సినిమాను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, తదుపరి సినిమాపై దృష్టి పెట్టారు. అధికారికంగా వెల్లడి కానప్పటికీ, ఈ సినిమాకు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారన్న విషయం తెలిసిందే. అయితే కధ విషయంలోనే తర్జనభర్జనలు పడిన మెగాస్టార్, ఫైనల్ గా “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” సినిమాకే మొగ్గుచూపారని తాజాగా తేలిన విషయం.
[m9ad]
ఇటీవల ఓ మీడియా ఛానల్ ద్వారా హీరో శ్రీకాంత్ ఈ విషయాన్ని ఇప్పటికే ఖరారు చేయగా, తాజాగా కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ “ఉయ్యాలవాడ నరసింహారెడ్డి” టైటిల్ ను రిజిస్టర్ చేయడంతో, మెగాస్టార్ 151వ సినిమాపై స్పష్టత వచ్చేసింది. దీంతో మెగా అభిమానుల సందడి మొదలైంది. తండ్రి సినిమా సంగతి ఇలా ఉంటే, తనయుడు రామ్ చరణ్ కూడా తన తదుపరి సినిమాను క్రేజీ కాంభినేషన్ లో సెట్ చేసుకున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా తెలుగులో ఓ సినిమా కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న మణిరత్నం దర్శకత్వంలో రామ్ చరణ్ 12వ సినిమా ఉంటుందని, ఈ సినిమాలో అరవింద్ స్వామి ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నట్లుగా అధికారికమైంది. స్వయంగా అరవింద్ స్వామి ఈ విషయాలు స్పష్టం చేయడంతో చెర్రీ తదుపరి సినిమాపై కూడా క్లారిటీ వచ్చేసింది. కమర్షియాలిటీకి కేరాఫ్ అడ్రస్ అయిన మెగా కాంపౌండ్ లో మణిరత్నంకు సినిమా లభించడమంటే సాధారణ విషయం కాదు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు.



