వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ వైసీపీ కార్యకర్తలను కాదని వాలంటీర్లతో కధ నడిపించారు. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత అది తప్పని తెలుసుకొని ఇకపై కార్యకర్తలకు అండగా నిలబడతానని చెప్తున్నారు.
కానీ నేటికీ కార్యకర్తల వద్దకు వెళ్ళకుండా ఎంపిక చేసిన కొందరిని తాడేపల్లి ప్యాలస్కి పిలిపించుకొని సంక్షేమ పధకాల డప్పు వాయించి, చంద్రబాబు నాయుడుని నాలుగు తిట్లు తిట్టిన తర్వాత, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం మీరందరూ కేసులకు భయపడకుండా కష్టపడి పోరాడండి. అవసరమైతే జైలుకి వెళ్ళి రండి. పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి పంపించేస్తుంటారు.
కానీ ముఖ్యమంత్రిగా క్షణం తీరికలేకుండా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు, ఆదివారం చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు (జీడీ నెల్లూరు) శాసనసభ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ టీడీపీ కార్యకర్తలతో ముఖాముఖి సమావేశమయ్యారు.
ఇంతకాలం పని ఒత్తిడి వలన మిమ్మల్ని కలవలేకపోయానని, కానీ ఇకపై ఇటువంటి గ్యాప్ రాకుండా తరచూ కలుద్దామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వచ్చి సాధారణ కార్యకర్తలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకొని తీర్చితే వారిలో ఎంత ఉత్సాహం వస్తుందో ఊహించుకోవచ్చు.
ఈ సందర్భంగా వేదికపైనే ఉన్న జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్చార్జికి సిఎం చంద్రబాబు నాయుడు సున్నితంగా చురకలు వేశారు.
“మీతో ఈవిదంగా ముఖాముఖి సమావేశం నిర్వహించాలని ఈ నలుగురికీ చెప్పాను. కానీ సమావేశం నిర్వహించారో లేదో మీకే తెలియాలి,” అంటూ చురకలు వేశారు.
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు తీరిక చేసుకొని ఓ నియోజకవర్గంలో కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం కాగలిగినప్పుడు, జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, నియోజకవర్గం ఇన్చార్జి కాలేరా?ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని సిఎం చంద్రబాబు నాయుడు అడగడం సమంజసమే కదా?
టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండా మోస్తూ పార్టీ కోసం రక్తం చిందించిన ప్రతీ ఒక్క కార్యకర్తని కలిసి కష్ట సుఖాలు తెలుసుకొని సమస్యలుంటే పరిష్కరిస్తానని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఓ కార్యకర్తకి పార్టీ పట్ల నిబద్దత, నాయకుడు పట్ల నమ్మకం, గౌరవం పెరగడానికి ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలే చాలా అవసరం. కనుక చంద్రబాబు నాయుడు స్పూర్తితో పార్టీలో అందరూ కార్యకర్తల బాగోగులు చూసుకుంటే టీడీపీకి వారే బలమైన పునాదిగా నిలుస్తారు.




