చంద్రబాబుని అరెస్ట్ చేస్తే లోకం స్పందించింది… జగన్‌పై దాడి జరిగితే?

CBN Jagan

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని జగన్‌ ప్రభుత్వం అరెస్ట్ జైల్లో పెట్టిన్నప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశ విదేశాలలో తెలుగువారు, ముఖ్యంగా ఐ‌టి ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.

కానీ అప్పుడు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ మాత్రం స్పందించలేదు. కానీ ఇటీవల విజయవాడలో జగన్మోహన్‌ రెడ్డిపై రాయి దాడి జరిగినప్పుడు మోడీ, కేటీఆర్‌ వెంటనే ఖండించారు.

ADVERTISEMENT

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయినప్పుడు టిడిపి నేతలు కూడా స్పందించలేదు. ఎవరి రాజకీయ కారణలు వారికున్నాయి కనుక ఎవరినీ తప్పు పట్టలేము.

టిడిపి కూడా రాయి దాడిని ఖండిస్తూనే, ఎన్నికలలో సానుభూతి కోసం జగన్‌ ఆడిన కొత్త డ్రామా అని తేల్చి చెప్పేసింది. రాయి దాడి గురించి వైసీపి నేతలు, వారి సొంత మీడియా విస్తృతంగా ప్రచారం చేసుకోవడంతో టిడిపి వాదనలకు బలం చేకూరిన్నట్లయింది.

అది కుట్రా లేదా డ్రామానా? అనేది పక్కన పెడితే, ముఖ్యమంత్రిపై రాయితో దాడి జరిగితే వైసీపి నేతలు, వారి సొంత మీడియా తప్ప బయట వారెవరూ కూడా ఈ ఘటనపై స్పందించకపోవడం గమనార్హం.

చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు సినీ పరిశ్రమలో పలువురు ఖండించారు. కానీ జగన్‌పై దాడి జరిగితే సినీ పరిశ్రమలో ఏ ఒక్కరూ స్పందించలేదని రాంగోపాల్ వర్మ ట్వీటేశారు.

నిజమే! అది చంద్రబాబు నాయుడు సంపాదించుకున్న గౌరవం. ఇది జగన్మోహన్‌ రెడ్డి ఏర్పరచుకున్న వ్యతిరేకత. వీటికి ఇంతకంటే స్పష్టమైన నిదర్శనం ఏముంటుంది?

సినీ పరిశ్రమని జగన్‌ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, సినీ ప్రముఖులను ఎంత అగౌరవ పరిచిందో, నేటికీ పోసాని వంటివారితో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లను ఏవిదంగా తిట్టిపోయిస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు. ఓ పక్క ఈవిదంగా వ్యవహరిస్తూ ఎవరూ మనకి సానుభూతి చూపలేదని బాధపడి ఏం ప్రయోజనం?

అక్రమస్తుల కేసులో జగన్‌ జైలుకి వెళితే, కుటుంబ సభ్యులు, సొంత పార్టీ నేతలు, రాజకీయ అవసరాలు ఉన్నవారు తప్ప బయటవారెవరూ వచ్చి పలకరించలేదు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు పవన్‌ కళ్యాణ్‌ వెంటనే వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా, అప్పటికప్పుడే టిడిపితో పొత్తులు కూడా ప్రకటించేశారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు అంటే ఇదేగా?

చంద్రబాబు నాయుడు, జగన్మోహన్‌ రెడ్డిల మద్య ఉన్న మరో పెద్ద తేడా ఉంది. చంద్రబాబు నాయుడు వలన ‘మేలు’ పొందినవారే దాని గురించి చెప్పుకొని సంఘీభావం వ్యక్తం చేస్తుంటారు. కానీ జగన్మోహన్‌ రెడ్డి తాను చేసిన ‘మేలు’ గురించి తానే చెప్పుకొంటారు. అంతే కాదు తన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో, చివరికి వాలంటీర్ల చేత కూడా ఆ మేలుని పదేపదే గుర్తుచేయిస్తూ చేసిన మేలు మరిచిపోవద్దని చెపుతుంటారు. ప్రతిఫలం ఆశించనప్పుడే మేలు. ఆశిస్తే అది ఇచ్చిపుచ్చుకోవడమే అవుతుంది కదా? కనుక వైసీపి ఏవిదంగా మేలు లెక్కలు వేసుకుందో, అదేవిదంగా ప్రజలు కూడా లెక్కలు వేసుకుని నిర్ణయం తీసుకుంటారని గ్రహించలేకపోయింది. లేకుంటే జగన్‌ వలన మేలు పొందిన వారందరూ నేడు రాయి దాడిని ఖండించి ఉండేవారే కదా?

ADVERTISEMENT
Latest Stories