తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కాకుండా, కేవలం వ్యక్తిగతంగా తన విజయవాడ పర్యటన ఉంటుందని స్పష్టం చేసిన కేసీఆర్, దానిని పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. కృష్ణానది తీరాన కొలువుతీరి ఉన్న కనకదుర్గమ్మ వారి మొక్కు తీర్చుకున్న కేసీఆర్ వెంట ఏపీ మంత్రి దేవినేని ఉమా ఉన్నారు. ఎయిర్ పోర్ట్ లో దిగిన సమయం నుండి, మళ్ళీ ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టే వరకు అన్ని కార్యక్రమాలు దేవినేని ఉమా దగ్గరుండి చూసుకున్నారు.
ఈ సందర్భంగా విజయవాడ నగరం రూపురేఖలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. విజయవాడ నగరం ఎంతగానో అభివృద్ధి చెందిందని, బందరు రోడ్డును బాగా విస్తరించారని, ముఖ్యంగా రోడ్డుకు ఇరువైపులా పెయింటింగులు బాగున్నాయని చెప్పారు. అలాగే బందరు రోడ్డు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు గ్రీనరీ చాలా బాగుందని, గన్నవరం విమానాశ్రయం కూడా బాగా తీర్చిదిద్దారని కితాబిచ్చారు..
కనకదుర్గమ్మ దర్శనం బాగా జరిగిందని, ముఖ్యమంత్రిగా మళ్లీ విజయవాడకు వచ్చి అమ్మ వారి దర్శనం చేసుకుంటానని తెలిపారు. రెండున్నర్ర ఏళ్ళ క్రితం అమరావతి శంకుస్థాపనకు విచ్చేసిన కేసీఆర్, మరలా ఏపీకి విచ్చేయడం ఇదే తొలిసారి. అప్పటితో పోలిస్తే విజయవాడ నగరం చాలా సుందరీకరణగా తయారైంది. అయితే ఈ అభివృద్ధి మాత్రం వైసీపీ – బిజెపి – జనసేన పార్టీలకు పట్టదు, గిట్టదు. ఎందుకంటే వారి ప్రయోజనాలు వారివి!



