నేడు అనంతపురంలో జరుగుతున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభలో సిఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మరో సంక్షేమ పధకం ప్రకటించారు.
స్త్రీశక్తి పధకం వలన రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు ఆదాయం కోల్పోతారు కనుక వారికి ఉపశమనం కలిగించేందుకు ఏడాదికి రూ.15,000 చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
నేడు అనంతపురం సభలో ఆ హామీ కూడా నెరవేర్చబోతున్నట్లు సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దసరాకి అంటే ఈ నెల 30 నుంచి వాహన మిత్ర పధకం కింద రాష్ట్రంలో ఆటోడ్రైవర్లందరికీ రూ.15,000 చొప్పున ఇస్తామని సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
జగన్ హయంలో జరిగిన ఆర్ధిక విధ్వంసం వలన రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితి ఇంకా అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ అటో డ్రైవర్లకు ఇచ్చిన మాటకు కట్టుబడి వాహన మిత్ర పధకాన్ని అమలుచేస్తామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఇది వరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధిని విస్మరించి సంక్షేమ పధకాల అమలుకే ప్రాధాన్యం ఇచ్చారు. ఆ పేరుతో జగన్ లక్షల కోట్లు ప్రజలకు పంచిపెట్టినప్పటికీ వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడలేదు కనుకనే నేటికీ సంక్షేమ పధకాల కోసం ఎదురుచూస్తున్నారు.
టీడీపి కూడా ఎన్నికలలో వైసీపీతో పోటీ పడుతూ సూపర్ సిక్స్ హామీలు ఇవ్వక తప్పలేదు. ఇచ్చింది కనుక కష్టమైనా నష్టమైన వాటిని అమలుచేయక తప్పడం లేదు!
అవసరమైన నిరుపేదలు, నిసహాయులకు సంక్షేమ పధకాలతో ఆదుకోవడం ఎంత ముఖ్యమో, అవసరం లేనివారికి ఇస్తుండటం అంతే అనర్ధం తెచ్చిపెడుతుంది.
ఇప్పటికే స్త్రీశక్తి పధకం వలన రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ. 3,500 కోట్ల భారం పడుతోంది. కానీ ఈ పధకం వలన నిరుపేద, సామాన్య, మద్యతరగతి మహిళలకు చాలా ప్రయోజనం కలుగుతోంది కనుక ఈ భారం భరించడం తప్పు కాదు.
కానీ స్త్రీశక్తి కారణంగా వాహన మిత్ర పధకం కూడా ఇప్పుడు అమలు చేయాల్సి వస్తోంది కదా?ఇప్పుడీ రరెంటి భారం ప్రభుత్వంపైనే పడుతుంది.
అంటే దానర్ధం ప్రభుత్వం జేబులో నుంచి తీసీయదు. మళ్ళీ ప్రజల నుంచే ఆ సొమ్ముని పన్నులు, చార్జీల రూపంలో వసూలు చేస్తుంది.
కనుక మద్యం కుంభకోణం కేసులో అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ అయితే, సంక్షేమ పధకాలలో తొలి బాధితులు, అంతిమ బాధితులు కూడా ఖచ్చితంగా ప్రజలే. మరి ఈ ఊబిలో నుంచి రాజకీయ పార్టీలు, ప్రజలు, ప్రభుత్వాలు ఎప్పుడు బయటపడుతాయో?





