గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైస్ జగన్ తన హాయంలో తనకు, తన పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెట్టినా, ఆ పోస్ట్ ను షేర్ చేసినా అది చిన్న పిల్లల నుంచి పండు ముసలి వయసు ఉన్న వారైనా సరే క్షమార్హం అన్నట్టుగా నిర్ధాక్షణ్యంగా, నిర్దయగా వారి పై కేసులు పెట్టి వేధించేవారు.
అలాగే ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులనే కాదు సొంత పార్టీ ఎంపీ లనైనా సరే ఉపేక్షించేది లేదు అనేలా పట్టాభి నుంచి రఘురామా కృష్ణంరాజు వరకు అందరికి వైసీపీ తరహా ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక ఎల్లో మీడియా అంటూ ఈటీవీ, టీవీ 5, ABN లను దుష్టచతుష్టయం గా చిత్రీకరిస్తూ మీడియా హక్కులను కాలరాశారు.
చివరికి కరోనా సమయంలో మాస్క్ లు సరిగా అందుబాటులో ఉండడం లేదు అన్న పాపానికి డాక్టర్ సుధాకర్ ను ఒక పిచ్చివాడిగా చిత్రీకరించి, నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా నిలబెట్టారు. అలాగే రజనీకాంత్ వంటి స్టార్ హీరో బాబు నాయకత్వాన్ని ప్రశంసించిన ఉదంతానికి గాను ఆయన పై వైసీపీ నేతలు దండుపాళ్యం మ్యాచ్ మాదిరి విరుచుకుపడ్డారు.
వైసీపీ అరాచకాలను ఎదిరించినందుకు బాబు పై అక్రమ కేసులు, అరెస్టులు కాగా…ఆ అరెస్టు ఖండించినందుకు గాను పవన్ పై నిర్బంధాలు, ఆంక్షలు…ఇలా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సామాన్యుడి నుండి సెలబ్రెటీ వరకు కార్యకర్త నుంచి పార్టీ అధినేత వరకు అందరు వైసీపీ బాధితులుగానే మిగిలారు.
అయితే నాడు జగన్ పాలనను నియంత పాలన అని, వైసీపీ ప్రభుత్వాన్ని నియంతృత్వ ప్రభుత్వం అంటూ వేలెత్తి చూపిన ప్రజలే ఇప్పుడు బాబు ని నిస్సహాయునిగా, కూటమి ప్రభుత్వాన్ని నిస్తేజంగా భావిస్తున్నారు. అధికారం చేతులు మారిన ఇంకా వైసీపీ నే పై చేయి సాధిస్తుంది అనేలా వైసీపీ అరాచకం ఇప్పటికి నిర్వీరంగా కొనసాగుతూనే ఉంది.
అది వైసీపీ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల నుంచి సాక్షి వంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా లో అభూతకల్పనల వరకు కూటమి ప్రభుత్వం పై వైసీపీ నీలి నీడలు, బాబు పాలన పై సాక్షి నీలి రాతలు వస్తూనే ఉంటున్నాయి. అవి రాజధాని అమరావతి అంశం నుంచి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల వరకు వైసీపీ విషం చిమ్ముతూనే వస్తుంది.
ఎప్పటికప్పుడు ప్రభుత్వం వైసీపీ చేస్తున్న ఈ ఫేక్ ప్రచారాలను ఖండిస్తూ అందుకు ప్రజలకు జవాబుదారిగా ప్రతిపక్షానికి సంజాయిషిగా సమాధానం చెపుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర్ర కావస్తుంది.
అయినా ఇప్పటికి వైసీపీ కి ప్రభుత్వం పై భయం పుట్టలేదు. ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగిన ఉదంతాలను తెచ్చి ఇక్కడ జరిగినట్టు చిత్రకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోస్టులు చేస్తుంది వైసీపీ సోషల్ మీడియా. ఈ నేపథ్యంలో వైసీపీ చేస్తున్న ఈ ఫేక్ ప్రచారాల పై స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించక తప్పలేదు, హెచ్చరించక అవ్వలేదు.
హంద్రీనీవా కాలువలో ప్రవాహం ఆగింది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ జరుగుతుంది, రాష్ట్రంలో యూరియా సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు అంటూ ఇలా రాష్ట్రంలో లేని సమస్యలను, రాష్ట్రానికి సంబంధం లేని అంశాలను వైసీపీ తన సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తుందని,
ఇటువంటి అసత్య ప్రచారాలను వెంటనే తిప్పికొట్టాలంటూ పార్టీ నేతలను ఆదేశించిన బాబు, ప్రభుత్వం అంటే పాలన చెయ్యాలా లేక ఇటువంటి ఫేక్ ప్రచారాలను వివరణ ఇస్తూ పోవాలా.? ఖబడ్దార్ అంటూ వైసీపీ సోషల్ మీడియా శ్రేణులను హెచ్చరించారు.
మొన్నటి వరకు మహిళల పై అసభ్యకర పోస్టుల తో విరుచుకుపడ్డ వైసీపీ, రాజధాని అమరావతి పై అసత్య ప్రచారాలు సాగించింది, ఇక ఇప్పుడు ఆ హద్దులను కూడా దాటి ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద, ప్రాజెక్ట్ ల మీద పడ్డారు, ఇటువంటి నీచ రాజకీయానికి పాల్పడే వారిని కట్టడి చేయడానికి త్వరలో చట్టాన్ని తీసుకొస్తాం అంటూ ప్రకటించారు బాబు.
అయితే నాడు జగన్ స్వేచ్ఛను హరించి నియంత మాదిరి పాలన చేసారు అనే ఆరోపణలను ఎదుర్కొంటే, నేడు బాబు మితిమీరిన స్వేచ్ఛ ను ఇస్తూ నిస్సహాయుడిగా మారుతున్నారు అనే అపవాదును మూటకట్టుకుంటున్నారు. మితిమీరిన స్వేచ్ఛ, మోతాదుకు మించిన సహనం, స్థాయికి మించిన ఓర్పు ఎప్పటికైనా చేటే అవుతుంది అనేది బాబు ఇప్పటికైనా గ్రహించాలి, అలాగే వైసీపీ నీచ రాజకీయాన్ని కఠినంగా అరికట్టాలి.





