“మా నమ్మకం నువ్వే జగన్… మా భవిష్యత్ నువ్వే జగన్…” అని వైసీపి నేతలు మనసులో అనుకొంటున్న మాటని రాష్ట్ర ప్రజలకు ఆపాదించేసి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి స్టికర్స్ అంటించేశారు. మంత్రులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్, మాజీలు కొడాలి నాని, అనిల్ కుమార్ వంటివారు మరో అడుగు ముందుకు వేసి “మా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు మేము జగనన్నతోనే ఉంటాము. ఆయన ఫోటోనే మేము గెలుస్తాము,” అని చెప్పుకొంటారు. అయితే వైసీపిలో చాలా మందికి వేరే దారి లేకపోవడం వలననే వారు ఆవిదంగా అంటున్నారని వేరే చెప్పక్కరలేదు. ఒకవేళ వారికి మరో బలమైన ప్రత్యామ్నాయం గనుక ఉంటే వారిలో ఎంతమంది వైసీపిలో కొనసాగేవారో అని ఆలోచిస్తే వైసీపి నేతల పరిస్థితి అర్దమవుతుంది.
చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లని ఇంతగా అవహేళన చేసిన తర్వాత వైసీపి నేతలకు ఆ రెండు పార్టీల తలుపులు శాస్వితంగా మూసుకుపోయాయి కనుక వాటిలో చేరలేరు. ఆంధ్రాలో కాంగ్రెస్ ఉనికే లేదు. బీజేపీలో చేరాలనుకొంటే పదవులు, అధికారం వదులుకోవలసి ఉంటుంది. వామపక్షాలలో చేరినా ప్రయోజనం ఉండదు.
కనుక వైసీపి నేతలకు అన్ని దారులు మూసుకుపోయాయని చెప్పవచ్చు. నిజానికి తమ నోటితోనే ఇతర పార్టీల తలుపులు మూసుకుపోయేలా చేసింది తమ అధినేత జగనే అని వారు ఇంకా గ్రహించిన్నట్లే ఉన్నారు. అందుకే ‘నువ్వే మా నమ్మకం జగన్’ అంటున్నారనుకోవచ్చు. నిండా మునిగిన వాడికి చలి ఏమిటన్నట్లు నేటికీ వారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ల మీద నోరు పారేసుకొంటూనే ఉన్నారు.
వైసీపిలో పిల్లి సుభాష్, బాలినేని వంటి కొందరు నేతలు మాత్రం ప్రతిపక్షాలపై నోరు పారేసుకోకుండా హుందాగా వ్యవహరిస్తుంటారు. అటువంటి వారికి టిడిపి లేదా జనసేన ద్వారాలు తెరిచే ఉన్నాయనుకోవచ్చు. వైసీపిలో మరికొందరు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనే పనిలో బిజీగా ఉన్నారు.
వారందరిదీ ఒక ఎత్తు అయితే వారి అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్కరిదీ మరో ఎత్తు అని చెప్పక తప్పదు. మళ్ళీ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అయితే పర్వాలేదు కానీ ఓడిపోతే ఆయన పరిస్థితి ఏమిటో ఎవరూ చెప్పలేరు.




