తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్యే పోటీ ఉంటుందని ఇప్పటికే స్పష్టమైంది. ఇప్పటి వరకు వచ్చిన మీడియా సర్వేలలో బిఆర్ఎస్ పార్టీ గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెపుతున్నాయి.
కానీ కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెపుతున్నాయి. అన్ని సర్వేలు కూడా బీజేపీ మూడు లేదా మజ్లీస్ తర్వాత నాలుగవ స్థానానికే పరిమితం కావచ్చని సూచిస్తున్నాయి.
మిగిలిన పార్టీలకు, స్వతంత్ర అభ్యర్ధులకు కలిపి ఈసారి రెండు-మూడు సీట్లకు మించి రావని స్పష్టం చేస్తున్నాయి. కనుక బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో ఏది గెలుస్తుంది?అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. సర్వే నివేదికలు 75% మాత్రమే నిజమే అయిన బిఆర్ఎస్ పార్టీ గెలుపు తధ్యం.
కానీ వాస్తవ పరిస్థితులను నిశితంగా గమనిస్తే ఈసారి హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఈసారి కాంగ్రెస్ చాలా గట్టి పోటీ ఇస్తుండటమే ఇందుకు ప్రధాన కారణం. కాంగ్రెస్కు టిడిపి, తెలంగాణ జనసమితి (ప్రొఫెసర్ కోదండరామ్), వైఎస్ షర్మిల మద్దతు ప్రకటించడంతో వారి ఓటు బ్యాంకులు కాంగ్రెస్కు బదిలీ అవడం ఖాయంగానే కనిపిస్తోంది.
సర్వేల ప్రకారం బీజేపీకి విజయావకాశాలు లేకున్నా అది కూడా బిఆర్ఎస్ పార్టీని దెబ్బ తీసేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. మోడీ, అమిత్ షాలు హటాత్తుగా ‘బీసీ ముఖ్యమంత్రి’ అంటూ బీసీలను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే, దాంతో బీజేపీ గెలిచినా గెలవక పోయినా బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంతో కొంత నష్టపోవడం ఖాయమే.
ఈసారి జనసేన, బీఎస్పీలు కూడా బరిలో దిగుతున్నాయి. తెలంగాణలో కాపులను, ఆంద్రా ఓటర్లను ఆకట్టుకొనేందుకు జనసేన గట్టిగా ప్రయత్నిస్తుండగా, దళితులను నమ్ముకొని తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న బీఎస్పీ కూడా కనీసం 4-5 సీట్లు గెలుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ లెక్కన అన్ని పార్టీల మద్య ఓట్లు చీలితే బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో దేనికీ పూర్తి మెజారిటీ లభించకపోవచ్చు. అప్పుడు హంగ్ ఏర్పడవచ్చు.






