మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అంత్య క్రియలు ఈరోజు ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలో నిగమ్బోధ్ ఘాట్ వద్ద అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి.
ఆర్ధిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధిబాట పట్టించిన డా.మన్మోహన్ సింగ్కు రాష్ట్రపతి, ప్రధాని, వివిద రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు, మల్లిఖార్జున ఖర్గేతో సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు, దేశంలోని అధికార, ప్రతిపక్షాల ముఖ్య నేతలు ఆయన ఇంటికి వెళ్ళి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈరోజు ఉదయం 8 గంటలకు ఆయన భౌతికకాయాన్ని ఇంటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలించారు. అక్కడ నుంచి ఆయన అంతిమ యాత్ర మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం నిగమ్బోధ్ వద్ద డా.మన్మోహన్ సింగ్ పేరిట ఘాట్ నిర్మించేందుకు అంగీకరించింది.
డా.మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలకుగాను పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ తరలివచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం చాలా అభినందనీయం. రాజకీయాలలో ఇటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం కలిగి ఉండటం చాలా అవసరం కూడా.
కానీ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని కష్టకాలంలో కాపాడుకుంటూ డా.మన్మోహన్ సింగ్తో కలిసి ఆర్ధిక సంస్కరణలు అమలుచేసి దేశాన్ని అభివృధ్దిపదంలో నడపినచ్చిన ప్రధాని పీవీ నరసింహారావు చనిపోయినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం అంత దుర్మార్గంగా వ్యవహరించింది?
చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉంటూ పార్టీకి ఎంతగానో సేవలు అందించిన పీవీ నరసింహారావు భౌతికకాయాన్ని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చి, పార్టీ తరపున ఆ మహానీయుడికి నివాళులు అర్పించడానికి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇష్టపడలేదు.
కనీసం ఆయనకు ఢిల్లీలో ఘనంగా అంత్యక్రియలు చేయలేదు. అప్పుడు ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి అంత్యక్రియలు చేయాల్సివచ్చింది.
అప్పుడైనా కాంగ్రెస్ అధిష్టానం, ఆ పార్టీ నేతలు ఆయన అంత్యక్రియాలను సక్రమంగా పూర్తిచేయనే లేదు. ఆయన చితికి నిప్పంటించి అందరూ హడావుడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆదే సమయానికి వర్షం కురవడంతో ఆయన చితి మంటలు మద్యలోనే ఆరిపోయాయి. ఈ విషయం ఆనాడు మీడియాలో ప్రముఖంగా వచ్చింది కూడా.
పీవీ నరసింహారావుతో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి, దేశానికి ఇంత సేవలు చేసినా ఆయన చనిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆవిదంగా ఎందుకు వ్యవహరించింది? అంటే బహుశః మైనార్టీ ప్రభుత్వంతోనే దేశాన్ని ప్రగతి పధంలో నడిపించిన పీవీ నరసింహరావు యొక్క గొప్పదనాన్ని జీర్ణించుకోలేనందున కావచ్చు. ఆయన దక్షిణాది రాష్ట్రానికి చెందినవారనే వివక్ష కారణం కావచ్చు. కారణం ఏదైనప్పటికీ ఆ మహా మేధావి, మహనీయుడు పట్ల కాంగ్రెస్ అధిష్టానం చాలా అనుచితంగా వ్యవహరించిందని చెప్పక తప్పదు.
డా.మన్మోహన్ సింగ్ నిష్కలంక చరితుడు, మహామేధావి, గొప్ప ఆర్ధిక నిపుణుడు అని యావత్ ప్రపంచం కొనియాడింది. కానీ భారత్తో సహా యావత్ ప్రపంచదేశాలలో ఆయన ప్రతిష్టకు భంగం కలిగేలా చేసిన కాంగ్రెస్ అధిష్టానమే ఇప్పుడు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తుండటం విశేషం.




