ఎన్ని పార్టీ కండువాలు మార్చినా రాజకీయంలో విజయశాంతికి మాత్రం విజయం వరించడం లేదు, ఆమె రాజకీయ జీవితానికి శాంతి చేకూరడం లేదు. సొంతగా పార్టీ పెట్టినప్పటికీ నిలదొక్కుకోలేక పార్టీని కేసీఆర్ పరం చేసిన రాములమ్మ, బిఆర్ఎస్ నుంచి బీజేపీ కి ఇక అక్కడ నుంచి కాంగ్రెస్ లోకి షిఫ్ట్ కొట్టారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంలో విజయశాంతికి ఎటువంటి అధికారిక పదవి దక్కలేదు, అలాగే అటు పార్టీ పరంగా శాంతికి ఎటువంటి ప్రత్యేక గుర్తింపు దక్కలేదు. అటు విజయశాంతి కూడా ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయాలలో పార్టీ అధికారిక కార్యక్రమాలలో కానీ, పార్టీ అంతర్గత సమావేశాలలో కానీ ఎక్కడ కనిపించరు.
అయితే పార్టీలో తనకు ఒక గౌరవం ఉండాలని, ప్రభుత్వంలోనూ తగిన గుర్తింపు కావాలని రాములమ్మ ఏకంగా పార్టీ అధిష్ఠానంతోనే చర్చలు మొదలు పెట్టారు. ఢిల్లీ కేంద్రంగా విజయశాంతి తనకు ఒక ఎమ్మెల్సీ పదవి కావాలంటూ పార్టీ పెద్దలతో మంతనాలు కొనసాగిస్తున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం దృష్ట్యా ఆ పార్టీకి మూడు నుంచి నాలుగు ఎమ్మెల్సీ అవకాశాలు దక్కే అవకాశం కనిపిస్తుంది.
దీనితో ఈసారైనా తనకు ఒక అవకాశం కల్పించాలంటూ ఈ సినీ సెలబ్రెటీ ఢిల్లీ బాట పట్టారు. అయితే ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్సీ కోసం ఎదురు చూస్తున్న ఆశావాదుల సంఖ్య అధికంగానే ఉన్న నేపథ్యంలో రాములమ్మ పార్టీ పెద్దలతో చేసే ఈ ఎమ్మెల్సీ శాంతి చర్చలలో విజయం సాధిస్తారా.? లేక బెటర్ లక్ నెక్స్ట్ టైం అనే ఊరడింపు తో వెనుతిరుగుతారా.?
సినీ జీవితంలో లేడీ సూపర్ స్టార్ గా లేడీ అమితాబ్ గా తనకంటూ ఒక ప్రత్యేక గురింపు తెచ్చుకున్న రాములమ్మ రాజకీయంలో మాత్రం తనదైన మార్క్ చూపించలేకపోయారు. నిలకడ లేని రాజకీయంతో ఇప్పటికే విజయశాంతి రాజకీయ జీవితం దాదాపు శుభం కార్డు దిశగా పయనిస్తుంది. ఇక ఇప్పుడు కూడా శాంతి కి రాజకీయంగా విజయం దక్కకపోతే మళ్ళీ పార్టీ కండువా మార్చడం తప్పదేమో..!




