కాంగ్రెస్, మజ్లీస్ రెండు భిన్న సిద్ధాంతాలతో పనిచేస్తుంటాయి. కాంగ్రెస్ లౌకికవాదాన్ని నమ్ముకుంటే, మజ్లీస్ కేవలం ఇస్లాం మతాన్ని, ముస్లిం ఓటర్లను మాత్రమే నమ్ముకుంటుంది.
కానీ బీహార్ ఎన్నికలలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కి కేవలం 6 సీట్లు రాగా, హైదరాబాద్, పాతబస్తీకి మాత్రమే పరిమితమైన మజ్లీస్ 5 సీట్లు గెలుచుకోగలిగింది.
అంటే దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ బీహార్ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటునప్పటికీ, దాని కంటే పాతబస్తీకి చెందిన మజ్లీస్ పార్టీ బీహార్లో మెల్లగా నిలదొక్కుకోగలుగుతోందని స్పష్టమవుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మజ్లీస్ పార్టీ పోటీ చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ విజయానికి మజ్లీస్ తోడ్పాటు అవసరమైంది.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ లేదా అధికారంలోకి రావాలనుకున్నప్పటికీ మజ్లీస్ సహాయసహకారాలు తప్పనిసరి.
హిందూమతం ఆధారంగా రాజకీయాలు చేసే బీజేపి కూడా ఇందుకు అతీతం కాకపోవడం ఇంకా విచిత్రం. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు నాయుడుని బూచిగా చూపించి ఏవిధంగా రాజకీయ మైలేజ్ తీసుకుంటారో అదేవిధంగా బీజేపి నేతలు కూడా మజ్లీస్ని బూచిగా చూపిస్తూ లబ్ది పొందుతుంటారు.
మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా బీజేపి ప్రధాన అస్త్రాలన్నీ మజ్లీస్ మీదే సందించింది. అందువల్లే నియోజకవర్గంలో కనీసం 17,041 హిందూ ఓట్లు పడ్డాయి లేకుంటే ఏమయ్యేదో?
మజ్లీస్ కూడా ఇదే ఫార్ములా అనుసరిస్తూ బీజేపిని, ఆర్ఎస్ఎస్ని బూచిగా చూపించి ముస్లిం ఓట్లను గంపగుత్తగా దండుకుంటుంది.
కాంగ్రెస్ సెక్యులర్ ఫార్ములా ప్రతీసారి, అన్ని చోట్ల పనిచేయకపోవచ్చు. కానీ బీజేపి, మజ్లీస్ మత ఫార్ములా మాత్రం ‘టార్గెట్ వోటర్లు’ ఉంటే తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుందని బీహార్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మరోసారి నిరూపితమైంది.







