తిరుమల తిరుపతి దేవస్థానం తెరుచుకుని వారం రోజులు కూడా కాకముందే మొట్టమొదటి కరోనా కేసు నమోదు అయ్యింది. టీటీడీలో శానిటరీ ఇన్స్పెక్టర్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. సదరు అధికారి గోవిందరాజ స్వామీవారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నారు. దీనితో రెండు రోజులపాటు గోవిందరాజ స్వామి ఆలయంలో దర్శనాల నిలిపివెయ్యాలని టీటీడీ నిర్ణయించింది.
ఉద్యోగికి కరోనా రావడంతో ఆలయంలో శానిటేషన్ చేయిస్తున్నారు. ఆదివారం నుండి తిరిగి దర్శనాలు అనుమతించనున్నారు. ఆలయంతో పాటు ఉద్యోగి తిరిగిన ప్రాంతాలను కూడా టీటీడీ మూసేసింది. సదరు ఉద్యోగితో కాంటాక్ట్ లో ఉన్న ఇతరులను కూడా హోమ్ ఐసోలేషన్ అవ్వమని ఆదేశాలిచ్చారు.
ఈ రెండు రోజుల పాటు స్వామి వారి పూజా కార్యక్రమాలు అర్చకులే ఏకాంతంలో నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉండగా… గడచిన 24 గంటలలో ఏపీలో కొత్తగా 207 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం 5636కి చేరిన కరోనా కేసులు.
అలాగే ఇప్పటి వరకు 80 కరోనా మరణాలు కూడా సంభవించాయి. కర్నూల్, కృష్ణ, గుంటూరు జిల్లాల లోనే సగానికి పైగా కేసులు నమోదు అయ్యాయి. కేసులు ఎక్కువ కావడంతో అధికారులు టెస్టులు కూడా గణనీయంగా పెంచారు. టెస్టులు చేసిన కొద్దీ కేసులు రావడం గమనార్హం.





