ఈ ప్రపంచానికి, మానవాళికి చైనా ఇచ్చిన అతి ఖరీదైన కానుక కరోనా మహమ్మారి. కరోనా వలన ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చనిపోగా, లాక్ డవున్ కారణంగా కోట్లాది మంది ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయి రోడ్డున పడ్డారు. కరోనా దెబ్బకు అమెరికా, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలతో పాటు యావత్ ప్రపంచదేశాలు గజగజ వణికిపోయాయి.
చైనా ఓ పక్క ఇరుగుపొరుగు దేశాలను భౌగోళికంగా, వ్యాపార పరంగా కబళించేయాలని ప్రయత్నిస్తుంటే, అది సృష్టించిన కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్నే కబళించేయబోయింది.
ముఖ్యంగా భారత్కు చైనాతో ఈ బెడద చాలా ఎక్కువుంది. కనుక ఓ పక్క చైనాని, మరోపక్క అది సృష్టించిన కరోనా మహమ్మారిని ఎదుర్కోక తప్పలేదు.
ఎట్టకేలకు భారత్, ఆమెరికాతో సహా కొన్ని దేశాలు వ్యాక్సిన్ తయారుచేసి కరోనా మహమ్మారిని నిలువరించగలిగాయి. కానీ దాని వలన కలిగిన ఆస్తి, ప్రాణ నష్టం ఎన్నటికీ తీరేది కాదు.
ఆ పీడకల ఇంకా కళ్ళ ముందే మెదులుతుంటే, కరోనా మహమ్మారి మళ్ళీ పలకరిస్తోంది. ఇప్పటికే చైనా, సింగపూర్, థాయ్ లాండ్, హాంగ్ కాంగ్లో కరోనా విజృంభిస్తోంది. వందల సంఖ్యలో కరోనా మరణాలు కూడా నమోదవుతున్నాయి. భారత్లో కూడా కరోనా కేసులు మళ్ళీ మొదలయ్యాయి.
ఇది ఆందోళన కలిగించే విషయమే కానీ భారత్తో సహా ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు కరోనా మహమ్మారిని సమర్ధంగా ఎదుర్కోగలిగే స్థితిలో ఉండటం కాస్త ఉపశమనం కలిగిస్తుంది.
కానీ కరోనా కేసులు మళ్ళీ పెరగక మునుపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టగలిగితే ఆదిలోనే నిలువరించవచ్చు. లేకుంటే గోటితో పోయేదానికి గొడ్డలి వినియోగించాల్సి వస్తుంది.




