దాదాపుగా ఒక వారం రోజులుగా తమిళనాడు రాజకీయాలకు కేంద్రంగా నిలిచిన గోల్డెన్ బే రిసార్ట్స్ లో వందకు పైగా ఎమ్మెల్యేలు తిష్ట వేసిన విషయం తెలిసిందే. వీరికి కాపలాగా మరో 200 మంది బౌన్సర్లు, వారందరికీ మూడు పూటలా భోజనాలు, ఆపై విందు వినోదాలు, పార్టీలు… ఇలా వీళ్లకు సకల మర్యాదలూ అందించినందుకు బిల్లు ఎంతయ్యిందని, ఎవరు చెల్లించాలని ఆలోచించారా? ఎవరు చెల్లించారో అన్న విషయం పక్కన పెడితే, బిల్లు ఎంత అయ్యిందో తెలుసుకుందాం.
ఈ రిసార్టులో మూడు రకాల గదులు… రోజుకు 5,500 అద్దెతో ట్రాంక్విల్ రూములు, 6,600 అద్దెతో బే వ్యూ రూములు, 9,900 అద్దెతో పారడైజ్ సూట్ రూములూ ఉన్నాయి. మొత్తం 60 గదులనూ బుక్ చేసుకుంటే, ఈ ఆరు రోజులకూ 25 లక్షల బిల్లు వస్తుంది. ఇక దీంతో పాటు తిండి, తిప్పల ఖర్చు కలిపితే, మరో 25 లక్షలు అవుతుంది. ఆపై ఎమ్మెల్యేలు, అక్కడున్న ఇతర శశికళ వర్గం వారికి కొత్త దుస్తుల నుంచి కోరిన అన్ని సదుపాయాలను కల్పించారు. వీటితో పాటు ప్రత్యేక సేవలు కావాలని కోరిన వారికి అవి కూడా సమర్చారు.
ఇలా వారం రోజులకు ఎమ్మెల్యేలకు అయిన ఖర్చు కోటి రూపాయలు దాటిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ బిల్లులను ఎవరు భరిస్తున్నారో, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అన్న అనుమానం మాత్రం తలెత్తకూడదు. ఎందుకంటే… పోలీసు వర్గాలకు ఇచ్చిన సమాచారం ప్రకారం… సదరు ఎమ్మెల్యేలంతా స్వచ్చంధంగా గోల్డెన్ బే రిసార్ట్ లో ఉంటున్నారు. అయినా రేపు రాబోయేదానితో నేడు ఖర్చు పెట్టబోయేది ఎంత..? అని ఆలోచించడం రాజకీయాల్లో సర్వసాధారణమే కదా!



