పార్లమెంట్ నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలో నేడు ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే అన్ని పార్టీల ప్రముఖులు (ఎంపీలు) వచ్చి ఓట్లు వేశారు. ఈరోజు సాయంత్రం 5లకు పోలింగ్ ముగించి 6 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టి వెంటనే ఫలితం ప్రకటిస్తారు.
ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్ధిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్ధిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో దిగారు.
కానీ ఎన్డీయే అభ్యర్ధి ఖరారు చేయడంతోనే సీపీ రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడం ఖాయం అయిపొయింది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
ప్రస్తుతం లోక్సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది ఎంపీలు కలిపి మొత్తం 781 మంది ఉన్నారు. రాజకీయ కారణాల వలన వీరిలో బీజేడీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 11 మంది ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు.
కనుక మిగిలిన 770 మంది ఎంపీలలో ఎన్డీఏకి 422 మంది, ఇండియా కూటమికి 324 మంది ఎంపీలున్నారు. కనుక సీపీ రాధాకృష్ణన్ ఉప రాష్ట్రపతిగా ఎన్నికవడం లాంచన ప్రాయమే.
ఈ ఎన్నిక ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల వైఖరిని అర్ధం చేసుకునేందుకు కూడా బాగా ఉపయోగపడింది.
బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ ఎన్డీయేకి మద్దతు ఈయలేదు. అది కాంగ్రెస్తో కలవదు కనుక జస్టిస్ సుదర్శన్ రెడ్డికి కూడా మద్దతు ఈయలేదు.
సింగిల్ సింహం వైసీపీ ఏ కూటమిలోనూ లేదు. కనుక ఎన్డీయే అభ్యర్ధి ఆర్ఎస్ఎస్ నేపద్యం, సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నేపధ్యం కారణంగా ఈ ఎన్నికకు వైసీపీ కూడా దూరంగా ఉండిపోవచ్చు. కానీ డజనుకు పైగా కేసులున్నందున ఎన్డీయే అభ్యర్ధికి జగన్ మద్దతు పలికి మోడీ, అమిత్ షాలకు మరోసారి విధేయత చాటుకున్నారు.
టీడీపి, జనసేన ఎన్డీయేలోనే ఉన్నాయి కనుక సీపీ రాధాకృష్ణన్కే మద్దతు ఇచ్చాయి. మరో మూడు-నాలుగు గంటల్లో సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారని అధికారిక ప్రకటన వెలువడుతుంది.




