జాతీయ పార్టీ సీపీఐ కొత్తగా రాజకీయాలలోకి రాలేదు. దేశ చరిత్రకున్నంత చరిత్ర ఆ పార్టీకి ఉంది. అలాంటి పార్టీ నేడు విశాఖపట్నంలోని వైజాగ్ ఎయిర్ పోర్టుని మూసివేయవద్దంటూ విమానాశ్రయం వద్ద ధర్నా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
విశాఖ, విజయనగరం శ్రీకాకుళం మూడింటికి మధ్య భోగాపురం వద్ద జాతీయ రహదారి పక్కనే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. జూలై 4 లేదా 5న ప్రధాని మోడీ దీనిని ప్రారంభించబోతున్నారు. కనుక ఆ తర్వాత అన్ని విమానాలు అక్కడి నుంచే రాకపోకలు సాగించబోతున్నాయి.
ఇంతకాలం వాడుకుంటున్న వైజాగ్ ఎయిర్ పోర్టు ఇండియన్ నేవీ కోసం నిర్మించినది. కనుక దానిని మళ్ళీ నేవీకి అప్పగించేయబోతున్నారు. కనుక అక్కడి రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రులు వంటి వీఐపీలు మాత్రమే రాకపోకలు సాగించగలరు. సామాన్య ప్రజలందరూ వచ్చే నెల నుంచి భోగాపురం విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.
అయిది ఈ కొత్త విమానాశ్రయం విశాఖలోని పెందుర్తి, గాజువాక, కూర్మన్నపాలెం, అటు అనకాపల్లి తదితర ప్రాంతాలలో నివసిస్తున్న వారికి చాలా దూరమవుతుంది. నగరంలో ట్రాఫిక్ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక కనీసం రెండు మూడు గంటల ముందు బయలుదేరాల్సి ఉంటుంది.
కనుక వారికి దగ్గరలో ఉన్న ప్రస్తుత విమానాశ్రయాన్ని యధాతధంగా కొనసాగించాలని కోరుతూ సీపీఐ నేతలు నేడు విమానాశ్రయం ముందు ధర్నా చేశారు. అది మూసేయడమంటే విశాఖ ప్రజలకు అన్యాయం చేస్తున్నట్లే అని వాదించారు. విమానాశ్రయం తరలింపు పెద్ద కుట్ర అని వాదిస్తున్నారు.
సీపీఐ వంటి జాతీయ పార్టీ నాయకులు ఈవిధంగా ప్రవర్తించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నగరంలో ఒకవైపు ఉన్నవారు మరోవైపు కొత్తగా కట్టిన విమానాశ్రయం చేరుకోవాలంటే చాలా ఇబ్బందే. కనుక కొత్తగా ఫ్లై ఓవర్లు నిర్మించాలనో లేదా రోడ్లు విస్తరణ చేపట్టాలనో డిమాండ్ చేస్తే అర్థం ఉంటుంది. కానీ 40-50 కిమీ దూరంలో ఉన్న రెండు విమానాశ్రయాలను నడిపించాలని కోరడం విడ్డూరంగా ఉంది.
హైదరాబాద్ నడిబొడ్డున బేగంపేట వద్ద ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నగరానికి చాలా దూరంగా శంషాబాద్కి మార్చిన తర్వాత నగర ప్రజలు ఇలాగే ఇబ్బందులు పడ్డారు. కనుక విమానాశ్రయానికి సులువుగా చేరుకునేందుకు పీవీ ఎక్స్ప్రెస్వే, ఓఆర్ఆర్తో అనుసంధానం చేశారు. విశాఖలో కూడా అదే జరుగబోతోంది.
కానీ అదెప్పుడో ప్రభుత్వం స్పష్టత ఇచ్చి ఉంటే ఇలాంటి అర్ధరహితమైన ధర్నాలు జరిగేవి కావు. ఇప్పటికైనా విశాఖ నగరంలో కొత్తగా ఫ్లై ఓవర్లు నిర్మించాలని తక్షణమే రోడ్లు విస్తరణ చేపట్టాలని ప్రభుత్వంపై సీపీఐ ఒత్తిడి చేస్తే అందరూ సంఘీభావం తెలుపుతారు. కానీ ఇలా గొంతెమ్మ కోర్కెలు కోరుతూ ధర్నా చేస్తే ప్రజలే నవ్వుతారు.




