ఊహించిన్నట్లుగానే ఏపీ బిజెపి అధ్యక్షుడు సోమూ వీర్రాజుని బిజెపి అధిష్టానం ఆ పదవిలో నుంచి తప్పించింది. ఆయనను తన పదవికి రాజీనామా చేయవలసిందిగా బిజెపి అధిష్టానం మంగళవారం ఉదయం ఫోన్ చేసి కోరింది. ఆ తర్వాత కొద్ది సేపటికే ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరిని ఏపీ బిజెపి అధ్యక్షురాలిగా నియమించిన్నట్లు బిజెపి జాతీయ కార్యదర్శి అరుణ్ కుమార్ ఢిల్లీలో ప్రకటించారు.
సోమూ వీర్రాజు జనసేనతో కలిసి పనిచేయలేకపోతుండటం, జగన్ ప్రభుత్వంతో గట్టిగా పోరాడలేకపోతుండటం వలననే తప్పించిన్నట్లు తెలుస్తోంది. అయితే కడప జిల్లాకు చెందిన సత్యకుమార్ యాదవ్ పేరు అధ్యక్ష పదవికి పరిశీలనలో ఉందని వార్తలు వస్తున్న సమయంలో అనూహ్యంగా దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించడం ఆశ్చర్యకరమే.
దగ్గుబాటి పురందేశ్వరిని ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా నియమించడం ద్వారా టిడిపితో బిజెపి పొత్తులు ఉండబోవని సూచించినట్లే భావించవచ్చు. దగ్గుబాటి పురందేశ్వరి-చంద్రబాబు నాయుడు బంధువులే అయినప్పటికీ వారి మద్య సఖ్యత లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి బిజెపి పెద్దలను కలిసి వచ్చిన తర్వాత నుంచి ఏపీలో 175 స్థానాలకు టిడిపి పోటీ చేస్తుందని చెపుతుండటం అదే సూచిస్తోంది.
అయితే బిజెపి-జనసేనల పొత్తులు కొనసాగే అవకాశం ఉందనే భావించవచ్చు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తమకు అభ్యంతరం లేదని బిజెపి ఇదివరకే ప్రకటించింది. బహుశః అందుకే పవన్ కళ్యాణ్ తాజా పర్యటనలో తాను ముఖ్యమంత్రి అభ్యర్ధినని ప్రకటించుకొని, జనసేనను గెలిపించాలని కోరుతున్నారనుకోవచ్చు.
కనుక త్వరలోనే మూడు పార్టీలు పొత్తుల విషయంపై స్పష్టత ఇచ్చే అవకాశం కూడా ఉంది.



