ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నేడు నెల్లూరులో పర్యటిస్తున్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ వైసీపి మీద బాంబు వేస్తున్నట్లు ఓ మాట చెప్పారు. “ఏపీలో బీజేపీ, జనసేనలు కలిసే ఎన్నికలలో పోటీ చేయబోతున్నాయి. దీనిలో ఎటువంటి సందేహమూ లేదు. టిడిపితో పొత్తు గురించి మా అధిష్టానమే తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకొంటుంది,” అని చెప్పారు.
ఆమె మొదటి నుంచి ఇదే మాట చెపుతున్నారు కదా?అని అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన తర్వాత, టిడిపి, జనసేనల సమన్వయ సమావేశాలు జోరుగా సాగుతున్న ఈవేళ ఆమె ఈ ప్రకటన చేశారు.
అంటే బీజేపీ కూడా టిడిపి, జనసేన కూటమిలో చేరబోతున్నట్లు ఆమె సూచించిన్నట్లే భావించవచ్చు. అయితే ఈ విషయం బీజేపీ అధిష్టానం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కనుక ఆమె అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే జనసేన టిడిపిని వీడి తమతో మాత్రమే కలిసి పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందేమో? అని కూడా అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ మాట తప్పే రకం కాదు. ఒకవేళ ఆయనకు అటువంటి ఆలోచనే ఉండి ఉంటే, టిడిపితో జనసేన సమన్వయ కమిటీ సమావేశాలకు బ్రేక్ వేసి ఉండేవారు కదా?
కనుక జనసేన, టిడిపిలతో పొత్తుకి అంగీకరిస్తేనే తెలంగాణలో బీజేపీతో పొత్తుకి అంగీకరించి ఉండవచ్చు. బహుశః తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ అధిష్టానం ఏపీలో టిడిపి, జనసేనలతో పొత్తులపై ప్రకటన చేయవచ్చు.
టిడిపి, జనసేనలు కలిస్తేనే ఓటమి తప్పదని ఆందోళన చెందుతున్న వైసీపి, బీజేపీని కూడా వాటితో ఎక్కడ కలుపుతారో అనే భయంతోనే దగ్గుబాటి పురందేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. వైసీపి భయపడుతున్నట్లే బీజేపీ కూడా వాటితో చేతులు కలపబోతోందని దగ్గుబాటి పురందేశ్వరి తాజా వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.
టిడిపి, జనసేనలు కలవకూడదనుకొని కోరుకొన్న వైసీపి అధినేత జగన్ వాటిని స్వయంగా తన చేత్తోనే కలిపారు. వాటితో బీజేపీ కలవకూడదని కోరుకొంటే విజయ సాయిరెడ్డి మాటలే నిజమయ్యేలా ఉన్నాయి. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో?




