టాలీవుడ్ పెద్దన్న, అందరివాడుగా పిలుచుకునే దర్శకరత్న దాసరి నారాయణరావు ఒక్కసారిగా కిమ్స్ లో జాయిన్ అయ్యారనే వార్త తెలుగు సినీ పరిశ్రమకు కుదిపేయడంతో, ఏకంగా మెగాస్టార్ చిరంజీవి వంటి వారు కూడా వచ్చి పలకరించాల్సి వచ్చింది. అయితే అప్పటినుండి ఇప్పటివరకు దాసరి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అందలేదు. ఆ తర్వాత కోలుకున్నారని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు డిశ్చార్జ్ కాలేదన్న విషయం, తాజాగా డాక్టర్లు చెప్పిన వివరాలతో తేటతెల్లమైంది.
దాసరిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు ఇంకా రెండు వారాల సమయం పడుతుందని కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ బి.భాస్కరరావు స్పష్టం చేసారు. శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ 35 రోజుల క్రితం దాసరి నారాయణరావు తమ ఆసుపత్రిలో చేరారని, ఈ సమయంలో ఆయన ఊపిరితిత్తుల్లోని ఇన్ ఫెక్షన్ ను క్లీన్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో పాటు, ఆయన కిడ్నీల పనితీరు మందగించిందని, దీంతో ఆయనను నాలుగు రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచి డయాలసిస్ నిర్వహించి చికిత్స అందించామని తెలిపారు.
ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల్లోని ఇన్ ఫెక్షన్ తగ్గుముఖం పట్టిందని, మూత్రపిండాల పని తీరు కూడా మెరుగుపడిందని తెలిపారు. మరో రెండు వారాలు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని తెలపడంతో సినీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఏది ఏమైనా దాసరి వయసు రీత్యా, మునుపటి కంటే మరింత జాగ్రత్తలు పాటించాలన్న విషయమైతే స్పష్టం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా తీయాలని భావించిన దాసరి, ప్రస్తుతం అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోవచ్చని ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.



