ఇటీవల ‘బ్రహ్మోత్సవం’ సినిమాను పరోక్షంగా ఉదహరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసిన దర్శకరత్న దాసరి, తాజాగా ‘పద్మశ్రీ’ అవార్డులపై మరోసారి తన గళం విప్పారు. తెలుగు సినీ పరిశ్రమలో టాలెంట్ కు గుర్తింపు లేదని, అధిక సిఫార్సులు వచ్చిన వారికి అవార్డులు ఇస్తున్నారని దర్శకరత్న దాసరి నారాయణరావు విమర్శలు చేసారు. ‘మా’ తరఫున సీనియర్ నటులు కైకాల, జమునలకు సన్మానం చేసిన సందర్భంగా వ్యాఖ్యానించిన దాసరి.., “ముక్కూ, మొహం తెలియని వారికి పద్మశ్రీ అవార్డులు ఇస్తున్నారని” ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డుల తీరును ఎండగట్టే ప్రయత్నం చేసారు.
“అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ వంటి వారు ఏం పాపం చేశారని వారికి ప్రతిష్ఠాత్మక అవార్డులు ఎందుకు దగ్గర కాలేదంటూ” మండిపడ్డారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి, ఇప్పుడు జీవితం గడవక ఇబ్బందులు పడుతున్న కళాకారులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు. దాసరి చేసిన వ్యాఖ్యలకు తోడు విలక్షణ నటుడు, ఎన్నో మహత్తరమైన పాత్రలు పోషించిన కైకాల సత్యనారాయణ కూడా తమకు దక్కుతున్న గౌరవ భావాలపై కలత చెందిన వ్యాఖ్యలు చేసారు.
“ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీనియర్ నటులకు ఎంత మాత్రమూ గౌరవం దక్కడం లేదని, ఏ సినిమా వేడుక, ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియడం లేదని, సీనియర్ నటులను మంచి మనసుతో అన్ని కార్యక్రమాలకూ ఆహ్వానిస్తే మంచిదని” సూచనలు చేసారు. మా అసోసియేషన్ మంచి కార్యక్రమాలను చేపడుతోందని ఈ సందర్భంగా ప్రశంసించారు కైకాల. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావుతో పాటు నటీనటులు రాజేంద్రప్రసాద్, విష్ణు, నరేష్, ఎస్వీ కృష్ణా రెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, మంచు లక్ష్మీ, ఆహుతి ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



