జగ్గయ్యపేటలో జనసేన జెండా దిమ్మె తొలగింపు వైసీపీ నిర్వాకమే

demolition of janasena flag block in jaggayyapetకృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో జనసేన జెండా దిమ్మె ధ్వంసం వ్యవహారంలో వైసీపీ కార్యకర్తలను వెనకేసుకు రాబోయి పురపాలక సంఘం సిబ్బంది అడ్డంగా బుక్ అయిపోయారు. కోదాడ రోడ్డులో మరో రెండు పార్టీల జెండా దిమ్మెలు కూడా ఉన్నాయి. వాటి పక్కనే జనసేన నేతలు కూడా తమ పార్టీ జెండా దిమ్మెను ఏర్పాటు చేశారు. నిన్న తమ అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదినం సందర్భంగా అక్కడ పార్టీ జెండా ఎగురవేయాలనుకొన్నారు. అయితే గురువారం అర్దరాత్రి దానిని తామే తొలగించామంటూ పట్టణ పురపాలక శాఖ జగ్గయ్యపేట పోలీసులకు సమాచారం ఇచ్చింది.

వైసీపీ కార్యకర్తలను వెనకేసుకు రావాలని ప్రయత్నించిన పురపాలక శాఖ అధికారులకు ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ఊహించని షాక్ ఇచ్చారు. అర్దరాత్రి కొందరు వ్యక్తులు జనసేన జెండా దిమ్మెను ధ్వంసం చేస్తుండగా రికార్డ్ చేసిన సీసీ టీవీ ఫుటేజీ ఆధారాలతో జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అది చూస్తే పురపాలక సిబ్బంది కాదని, వైసీపీ కార్యకర్తలని స్పష్టంగా తెలుస్తోంది.

ADVERTISEMENT

ఒకవేళ వారే పురపాలక శాఖ సిబ్బంది అనుకొన్నా అర్దరాత్రి అంత రహస్యంగా ఎందుకు జెండా దిమ్మెను ధ్వంసం చేశారని బండ్రెడ్డి రామకృష్ణ నిలదీశారు. పక్కనే రెండు పార్టీలకు చెందిన మరో రెండు జెండా దిమ్మెలు ఉండగా జనసేన దిమ్మెను మాత్రమే ఎందుకు తొలగించారని నిలదీశారు.

ఈ ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానం లేదు. కనుక దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులు జయ్యపేట పురపాలక శాఖకు లేఖ వ్రాశారు. దాని ఆధారంగా ఫిర్యాదుపై తగు చర్యలు తీసుకొంటామని చెప్పారు.

పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు నిన్న జగ్గయ్యపేటలో పార్టీ జెండా ఎగురవేసి వేడుకలు, ర్యాలీలు నిర్వహించాలకొన్నారు. కానీ జగ్గయ్యపేట పోలీసులు వాటినీ అనుమతించలేదు. కానీ వైసీపీ నేతల ర్యాలీలు, సభలకు ఎటువంటి అభ్యంతరం చెప్పడం లేదు!

పైగా ఈ వేడుకలలో పాల్గొనేందుకు వచ్చిన ఐదుగురు జనసేన నాయకులను శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారంటూ జగ్గయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై సెక్షన్ 151 కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయాలను జనసేన నేతలు తమ రాష్ట్ర నాయకుడు నాదెండ్ల మనోహర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై పవన్‌ కళ్యాణ్‌తో చర్చించి నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.

జనసేన ఓ రాజకీయ పార్టీ. అది తమకు ఏ రకంగానూ పోటీ కాదని వైసీపీ మంత్రులే చెపుతున్నారు. మరి అటువంటప్పుడు జనసేన జెండా దిమ్మెను ఎందుకు ధ్వంసం చేసినట్లు?జనసేన వేడుకలకు ఎందుకు అనుమతి నిరాకరించినట్లు? అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, లోలోన జనసేనను చూసి ఆందోళన చెందుతున్నారని, దానికి ఈ ఘటనలే నిదర్శనాలని వాదిస్తున్నారు. వైసీపీ నేతలు… కాదనగలరా?

Watch and subscribe for Exclusive Interviews:

ADVERTISEMENT
Latest Stories