నగరాలు, పట్టణాలలో ఏ సమస్యలున్నా వెంటనే కాకపోయినా ప్రభుత్వాలు తప్పక స్పందించి ఆ సమస్యలను పరిష్కరిస్తుంటాయి. కానీ మారుమూల గ్రామాలలో, ముఖ్యంగా ఏజన్సీ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల కష్టాలను, సమస్యలను మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నా పెద్దగా పట్టించుకోవు.
ఎందువల్ల అంటే ఏజన్సీ ప్రాంతాలలో ఏం చేసినా ప్రభుత్వాలకు పెద్దగా గుర్తింపు రాడు. అదే.. నగరాలు, పట్టణాలలో చేసే ప్రతీ చిన్న అభివృద్ధి పని బాగా హైలైట్ అవుతుంటుంది… ప్రభుత్వం బాగా పనిచేస్తోందని ప్రజలు నమ్ముతుంటారు కనుక.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో 55 గిరిజన గ్రామాలకు రోడ్లే లేవు. కనుక అక్కడి గిరిజనులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రోగులను, గర్భవతులను సమీపంలో ఆస్పత్రికి తరలించాలంటే డోలీ లేదా నులకమంచంపై భుజాలపై మోస్తూ కొండలు గుట్టలు, వాగులు, వంకలు దాటుకొని రావాల్సిందే. ఆలోగా ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతుంటారు.
ఒక్క రోడ్ వేస్తే అంబులెన్స్ రాగలదు లేదా ఆటోలోనో ద్విచక్ర వాహనం మీదనో వారిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడగలరు. కానీ ఇంత చిన్న పని కూడా ఏ ప్రభుత్వమూ చేయలేకపోవడం చాలా బాధాకరమే కదా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లో రాజకీయ నాయకుడు కంటే మానవతావాది ఎక్కువగా కనిపిస్తుంటాడు. అందుకే మన్యం జిల్లాలో ఏజన్సీ ప్రాంతాల ప్రజల కష్టాలు తీర్చేందుకు నడుం బిగించారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పార్వతీపురం ప్రాంతంలో రూ.49.73 కోట్లు వ్యయంతో 48 కిమీ మేర మొత్తం 19 రోడ్లని నిర్మింపజేశారు.
ఆయా ప్రాంతాలలో గిరిజనులను కలిసి వారి కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకు కాలినడక బయలుదేరితే ఆయన వెంట జిల్లా కలెక్టర్, అధికారులు, సిబ్బంది నడవక తప్పలేదు.
“ఈ బురద, రాళ్ళపై నడవడం చాలా కష్టంగా ఉందని జిల్లా కలెక్టర్ చెపితే, “మనం ఒక్క కిలోమీటరు నడవడానికి ఇబ్బంది అంటున్నాము. మరి ఈ గిరిజనులు నిత్యం డోలీలతో ఇన్ని కిలోమీటర్లు ఎలా నడవగలరు?వారి కష్టం మనకి అర్దం కావాలంటే కనీసం ఒక కిలో మీటరు నడవాల్సిందే,” అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు సాగగా అందరూ ఆయనని అనుసరించక తప్పలేదు.
గిరిజన ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులతో సహా మంత్రులు, అధికారులలో ఇటువంటి ఆలోచనా ధోరణి, మానవతావాదం కొరవడంవల్లనే ఏజన్సీ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయాయని అర్దమవుతూనే ఉంది.
కనీసం ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వంటి ఓ నాయకుడు మన్యంలో పర్యటించి వారి కష్టాలు తెలుసుకొని పరిష్కరిస్తుండటం చాలా అభినందనీయం.
రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం నగరాలకు పట్టణాలకు మాత్రమే పరిమితం కాదు.. మారుమూల గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలి. అక్కడ నివసిస్తున్నవారు కూడా సంతోషంగా జీవించగలగాలి. అప్పుడే ఏ ప్రభుత్వానికైనా సార్ధకత, పరిపూర్ణ కలుగుతుంది. దానిని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆచరణలో సాధించి చూపుతున్నారు.
పవన్ కళ్యాణ్ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువు (పినకోట పంచాయతీ)లో పర్యటిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10గం.30నిమిషాలకి బల్లగరువు ప్రాంతానికి చేరుకుంటారని జనసేన పార్టీ తెలియజేసింది.






