గత కొంతకాలంగా ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్న ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్, తాజాగా మరోసారి పవన్ పై ఫిర్యాదుతో మీడియాకెక్కారు. ఈ నెల 27వ తేదీన తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ లో ఉన్న హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు.
‘తనకు కులాలు, మతాలు రుద్దితే అరికాళ్ల నుంచి నషాళానికి మంటెక్కుతుందని’ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని, భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లను ఏర్పాటు చేసి రిజర్వేషన్లు అమలు చేస్తుండగా, వారి హక్కులకు భంగం కలిగేలా పవన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ను అడ్డం పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్ బ్యాక్ గ్రౌండ్ లో ఎవరు ఉన్నారో గానీ, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ మాత్రమే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు కులమతాలు తనకు లేవు అన్నందుకు ఫిర్యాదు చేసిన ఇదే ఉదయ్ కిరణ్, గతంలో కాపు కులాల రిజర్వేషన్ల గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదంటూ విమర్శలు గుప్పించారు. మొత్తానికి పస లేని విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా ఉదయ్ కిరణ్ నిలుస్తున్నారని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.



