“కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” గత రెండేళ్లుగా నలుగుతున్న ఈ ప్రశ్నకు ఈ నెలాఖరున సమాధానం లభించనుందని చెప్తూ… ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ చిత్రానికి సంబంధించిన పలు విషయాలను దర్శకుడు రాజమౌళి పంచుకున్నారు. అమరేంద్ర బాహుబలి సవతి తల్లిగా శివగామి అద్భుత నటనను కనబరిచారని, దేవసేనను అమరేంద్ర బాహుబలి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడని, దేవసేన – శివగామి మధ్య నడిచే సుమారు 30 నిమిషాల సన్నివేశాలు చిత్రానికి ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు.
‘బాహుబలి’ని ఇక్కడతో వదిలేయదలుచుకోవడం లేదని, మినీ టీవీ సీరియల్గా రూపొందించనున్నట్టు కూడా స్పష్టం చేసారు జక్కన్న. ప్రస్తుతం ప్రసారమవుతున్న టీవీ సీరియళ్లకు భిన్నంగా 13 ఎపిసోడ్లతో మినీ టీవీ సీరియల్ను రూపొందించాలనుకుంటున్నట్టు తెలిపారు. ప్రముఖ రచయిత నీలకంఠన్ ‘బాహుబలి’ సినిమా కథకు ముందస్తు ఘట్టాలతో (ప్రీక్వెల్) మూడు భాగాలుగా ‘ది రైజ్ ఆఫ్ శివగామి’ అనే పేరుతో పుస్తకం రాస్తున్నారు. ఇందులో భాగంగా తొలి పుస్తకాన్ని చదివానని, అందులోని ప్రతి పాత్ర తనను ఆకట్టుకుందని అన్నారు.
శివగామి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని కితాబిచ్చారు. దీని ఆధారంగా మినీ టీవీ సీరియల్ నిర్మిస్తానని తెలిపారు. నీలకంఠన్ మాట్లాడుతూ మాహిష్మతి సామ్రాజ్ఞిగా శివగామి ఎదిగిన వైనాన్ని పుస్తకంలో వివరించినట్టు, అలాగే కట్టప్ప పడిన అంతర్మథనాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నారు. సినిమా కథలో లేని 40 కొత్త పాత్రలను ఈ పుస్తకం కోసం రచయిత సృష్టించారు. అంటే సిల్వర్ స్క్రీన్ పైన ‘బాహుబలి’ ముగిసినా గానీ, ప్రేక్షకులకు మాత్రం ఈ ‘బ్రాండ్’ ఎప్పటికీ సుపరిచితంగానే ఉండనుందన్న మాట.



