
ఇదివరకు ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఆంధ్రాలో విధ్వంసం జరుగుతుంటే, తెలంగాణలో అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుండేది. ఏపీలో అరాచక పరిస్థితులను చూసి ఏపీకి రావలసిన కంపెనీలే కాక ఉన్నవి కూడా మూటాముల్లె సర్దుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయాయి.
జగన్మోహన్ రెడ్డిని ఎంతగానో అభిమానించే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటివారు సైతం ఏపీలో పరిస్థితులు చూసి జాలి పడేవారు. అవహేళన చేసేవారు. అయినా జగన్ ప్రభుత్వం దులిపేసుకునేది.
Also Read – వైసీపీ వేణు స్వామి ని ఆశ్రయించాలేమో..!
తెలంగాణ పోలింగ్ సమయంలో నాగార్జున సాగర్ డ్యామ్ పైకి ఏపీ పోలీసులు, అధికారులను పంపించి ‘తెలంగాణ సెంటిమెంట్’ పండించి కేసీఆర్ రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు కూడా. కేసీఆర్ పట్ల జగన్ ఇంత విధేయంగా మెసులుకుంటున్నారు కనుకనే నేటికీ వారి బంధం చెక్కుచెదరలేదు.
అయితే ఇద్దరూ ఆరు నెలల తేడాతో ఒకేసారి ఓడిపోవడంతో వారి పరిస్థితి తారుమారు అయ్యింది. ఈ మార్పుతోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితి కూడా తారుమారు అయిన్నట్లే కనిపిస్తోంది.
Also Read – అభివృద్ధి కనిపిస్తుంది…సంక్షేమం మొదలయ్యింది..!
జగన్ అధికారంలో ఉన్నప్పుడు, ఏపీ అంటే రాజకీయ కక్షలు, అవినీతి, అరాచకం అన్నట్లుండేది. సంక్షేమ పధకాల గోల తప్ప అభివృద్ధి అనే పదం వినపడేది కాదు. అదే సమయంలో తెలంగాణలో అభివృద్ధి, లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటి కంపెనీలు వంటి మాటలు వినిపిస్తుండేవి.
కానీ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు ‘అభివృద్ధి కేరాఫ్ ఏపీ’ అన్నట్లు మారగా, తెలంగాణ అంటే కాంగ్రెస్-బిఆర్ఎస్ పార్టీల రాజకీయాలు మాత్రమే అన్నట్లు మారింది.
Also Read – మద్యం కేసు నకిలీదైతే వైసీపీకి భయం దేనికి?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎడాపెడా హామీలు ఇచ్చేసినందున వాటితోనే రాజకీయ యుద్ధాలు జరుగుతున్నాయి.
తెలంగాణ, రాజధాని హైదరాబాద్ ఎంతగా అభివృధ్ది చెందినప్పటికీ రాష్ట్ర ఆదాయం-ఖర్చుల మద్య చాలా భారీ వ్యత్యాసం ఏర్పడింది. పైగా కాంగ్రెస్, బీజేపిలు బద్ద శత్రువులు కావడం కూడా సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి శాపంగా మారింది. కనుక కేంద్రం నుంచి ఆశించినంతగా తెలంగాణకు సాయం లభించడం లేదు.
ఇటువంటి సమస్యలు, ఆర్ధిక పరిమితులకు తోడు కాంగ్రెస్ ప్రభుత్వంలో, పార్టీలో అంతర్గత సమస్యలు, ఒత్తిళ్ళ కారణంగా సిఎం రేవంత్ రెడ్డి చేతులు కాళ్ళు కట్టేసినట్లయింది. కనుక తెలంగాణలో అభివృద్ధి నత్తనడకన సాగుతోంది.
ఈ నేపధ్యంలో రేపు (మే 2)న ప్రధాని మోడీ అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభానికి వచ్చి ఏపీలో రూ.57,962 కోట్లు విలువగల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతుండటం తప్పక తెలంగాణ రాజకీయాలపై, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపుతాయి.
జగన్ దెబ్బకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక ఎన్నటికీ కొలుకోలేదనుకుంటే లేచి నిలబడటమే కాక చంద్రబాబు నాయుడు సారధ్యంలో లేడీలా పరుగులు తీస్తోంది.
మరోవైపు భారీ అంచనాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి కనీసం ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులు కూడా భర్తీ చేసుకోలేని నిసహాయ స్థితిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాలలో ఫెయిల్ అయ్యిందని, ఆయన పాలనలో తెలంగాణ రాష్ట్రం భ్రష్టు పట్టిపోతోందని కేసీఆర్ మొన్ననే సర్టిఫికేట్ ఇచ్చారు.
కానీ నేటికీ రేవంత్ రెడ్డికి మరో మూడేళ్ళు గడువు ఉంది. కనుక ఈలోగా ఈ సమస్యలన్నీటినీ అధిగమించి తెలంగాణని మళ్ళీ అభివృద్ధిపధంలో నడిపించగలిగితే వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ గట్టెక్కుతుంది. లేకుంటే కేసీఆర్ కాంగ్రెస్ని ఓడించేందుకు, రాబోయే మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్లో సిఎం చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధిని చూపించి మరీ ఓడగొడతారు. కనుక సమయం మించిపోక ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేల్కోవలసి ఉంటుంది.