గత కొన్నాళ్లుగా హల్చల్ చేస్తున్న ఓ వార్త కార్యరూపం సిద్ధించుకోబోతోంది. కృష్ణాజిల్లా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఉన్న దేవినేని నెహ్రూ కాంగ్రెస్ ను వీడి అధికార తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని కొన్నాళ్ళుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఓ స్పష్టత వచ్చింది. టిడిపి నేత కళా వెంకట్రావుతో కలసి దేవినేని నెహ్రూ, అవినాష్ లు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చి చర్చలు జరుపగా, పార్టీలోకి దేవినేని వచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దీంతో సెప్టెంబర్ రెండో వారంలో పార్టీలో అధికారికంగా చేరనున్నట్టు దేవినేని నెహ్రూ, అవినాష్ లు ప్రకటించారు. మరో పది రోజుల్లో టీడీపీలో చేరుతామని చంద్రబాబుకు స్పష్టం చేసిన దేవినేని, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు వెల్లడించారు. చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని, రాష్ట్రం కోసం ఆయన పడుతున్న కష్టానికి తన వంతు తోడ్పాటును అందిస్తానని తెలిపారు. తన అనుయాయులు, కార్యకర్తలతో చర్చించిన తరువాతే కాంగ్రెస్ పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు దేవినేని పేర్కొన్నారు.
దేవినేని నెహ్రూను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఈ సందర్భంగా కళా వెంకట్రావు తెలిపారు. అయితే, విజయవాడ రాజకీయాల్లో ప్రధాన నేతలైన వల్లభనేని వంశీ, దేవినేని ఉమ, దేవినేని నెహ్రూ వంటి వారంతా ఒకే పార్టీలో ఉండటంతో… వీరి మధ్య సయోధ్య ఏ మేరకు ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదీ గాక దేవినేని నెహ్రూ చేరిక పార్టీకి ఏ మేరకు దోహదపడుతుందో అన్నది ప్రశ్నార్ధకమే అంటూ పొలిటికల్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే గతంలో తెలుగుదేశం సభ్యుడైన దేవినేని నెహ్రూ మళ్ళీ సైకిల్ ఎక్కుతుండడం పెద్దగా ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు.



