వైసీపి మంత్రులు మాట్లాడే మాటలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి, ప్రజాభిప్రాయం ఏవిధంగా ఉందో తెలియజేస్తున్నాయి.
శ్రీకాకుళంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనప్పుడు ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ,”గ్రామాలలో ప్రజలు సంక్షేమ పధకాలతో చాలా సంతృప్తిగా ఉన్నారు. మళ్ళీ జగన్కే ఓటేస్తామని చెపుతున్నారు. కానీ మన గుర్తు ఏదని అడిగితే ‘సైకిల్ గుర్తు’అని దానికే ఓట్లు వేస్తామని చెపుతున్నారు. చాలా కాలంగా రాష్ట్రంలో అందరికీ ‘సైకిల్ గుర్తు’ అలావాటు అయిపోయింది. దాంతో ఓట్లు వేసేటప్పుడు చేయి అలవాటుగా సైకిల్ గుర్తువైపు లాగేస్తుంటుంది. కనుక మన పార్టీ గుర్తు ‘ఫ్యాన్’ అని అందరికీ అర్దమయ్యేలా చెప్పుకోవాలి. లేకుంటే కొంప మునిగిపోతుంది,” అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.
ఏపీలో వైసీపి అధికారంలోకి వచ్చి అప్పుడే నాలుగున్నరేళ్ళవుతోంది. ఈ నాలుగున్నరేళ్ళలో సచివాలయాలకు, పంచాయతీ ఆఫీసులకు, టిడిపి హయాంలో నిర్మించిన ఇళ్ళకు, చివరికి కరెంటు స్థంభాలకు కూడా వైసీపి రంగులు వేసుకొంటోంది. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ఇంటింటికీ స్టిక్కర్స్ కూడా అంటించింది.
నాలుగున్నరేళ్ళుగా సంక్షేమ పధకాల గురించి ప్రచారం చేసుకొనేందుకు వేలకోట్లు ఖర్చు చేస్తోంది. వచ్చే ఎన్నికలలో వైసీపిని గెలిపించేందుకు ఐప్యాక్ని, సచివాలయాలను ఏర్పాటు చేసుకొంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలందరినీ వైసీపివైపు తిప్పుకొనేందుకు లక్షలాది వాలంటీర్లను గృహసారధులను, ఇంటింటికీ పంపించి ఒత్తిడి చేస్తూనే ఉంది.
మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపి నేతలు కాళ్ళు అరిగిపోయేలా గడపగడపకు తిరుగుతూనే ఉన్నారు. ఇన్ని చేస్తున్నా ప్రజలు హృదయాలలో నిలిచిపోయిన సైకిల్ గుర్తుని వైసీపి చెరపలేకపోయిందని మంత్రి ధర్మాన మాటలతోనే స్పష్టం అవుతోంది కదా?



