టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జరిపిన మంతనాల ఫలితంగా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి మరో కొత్త రైలు వచ్చేసింది, అనంతపురం జిల్లా ధర్మవరం – అమరావతి మధ్య పరుగులు పెట్టనున్న ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు… రాయలసీమ ప్రాంత ఉద్యోగులు, ప్రజలకు వరప్రదాయనిగా మారనుంది. రాయలసీమకు రైల్వే కనెక్టివిటీ చాలా తక్కువ కావడంతో ఈ రైలు సీమ వాసుల కష్టాలను ఎంతో కొంత తీరుస్తుందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఏపీ కోటా నుంచి రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఇటీవల విజయవాడకు విచ్చేసిన సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన పసందైన విందు ఫలితంగా దీన్ని చెప్పుకుంటున్నారు. “రైల్వే మంత్రి సురేశ్ ప్రభుతో ప్రతి నెలా సమావేశమవుతాను. ప్రతి రెండు నెలలకు ఓ కొత్త రైల్వే ప్రాజెక్టును తీసుకువస్తాను” అంటూ నాడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కార్యరూపం దాలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొత్తానికి ఏపీ కోటాలో రాజ్యసభకు ఎంపికైన సురేశ్ ప్రభు న్యాయం చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది.
ఇప్పటికే హైదరాబాద్ – అమరావతి మధ్య ‘ఇంటర్ సిటీ’ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. తాజాగా ధర్మవరం – అమరావతి రైలుకు సురేశ్ ప్రభు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే మంగళవారం మంత్రి సురేశ్ ప్రభు ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ రైలును ఆరంభించనున్నారు. వారానికి మూడు రోజులు (సోమ, బుధ, శని) వారాల్లో విజయవాడ నుంచి బయలుదేరి అమరావతి మీదుగా ధర్మవరం చేరే ఈ రైలు… ఆ మరుసటి రోజుల్లో తిరిగి ధర్మవరం నుంచి అమరావతి వెళుతుంది. ఈ రైలుకు సంబంధించిన టైం టేబుల్, నెంబర్లను మరో రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.



