సిబిఐ డైరెక్టరుగా, జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో దూకుడుగా ముందుకెళ్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలన ప్రభుత్వ ఉద్యోగిగా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లికించుకున్నారు జేడి. లక్ష్మి నారాయణ.
జగన్ కేసుల విచారణ తీరులో జేడి చూపిన తెగువ, తెగింపు చూసి యువతలో ఆయన పట్ల ప్రత్యేక అభిమానం నెలకొంది. జగన్ కేసుల విచారణాధికారిగా జేడీకి ప్రజలలో మంచి గుర్తింపు, ఆదరణ ఏర్పడిన అంత వాస్తవం. అయితే రాజకీయ ఎవరైనైనా ఎక్కువగా ఎదగనివ్వదు అనే నానుడి నిజమనేటట్లుగా జగన్ కేసులనుంచి ఒక్కసారిగా జేడీని తప్పించారు.
ఆ సంఘటన తరువాత కొన్నాళ్ళు సైలెంట్గా తన పని తానూ చేసుకుంటున్న జేడి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి రాజకీయ ఎంట్రీకి సిద్దమయ్యి అందరికి ఊహించని షాక్ ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల సమయంలో రాజకీయ అరంగేట్రం చేసిన జేడి కొన్నాళ్ళు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని, మరికొన్నాళ్లు టీడీపీలో కానీ బీజేపీలో కానీ చేరుతారని ప్రచారం జరిగింది.
చివరి నిముషంలో అనూహ్యంగా జనసేనలో చేరి విశాఖ ఎంపీగా బరిలో దిగి సుమారు 2 లక్షల 80 వేల ఓట్లు సాధించారు. జేడి రాజకీయ ఎంట్రీతో ఒక్కసారిగా వైసీపీ ఉలిక్కిపడింది. అయితే 2019 లో జేడీతో పాటు జనసేన కూడా ఓటమి చెందడంతో పవన్ తిరిగి సినిమాలలో నటించడం తనకు నచ్చలేదనే కారణంతో జనసేనను వీడి బయటకు వెళ్లారు.
2019 లో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఒక రాజకీయ విశ్లేషకుడిగా మారిన జేడి మళ్ళీ 2024 ఎన్నికల ముందు “జై భారత్ నేషనల్ పార్టీ” పేరుతో ఏపీలో మరో కొత్త పార్టీకి పురుడు పోశారు. అయితే సొంత పార్టీ తరుపున విశాఖ నార్త్ ఎమ్మెల్యే గా పోటీలో నిలిచి కూటమి సునామీలో కొట్టుకుపోయారు. 2024 ఎన్నికల ఫలితాల తరువాత ఏపీ రాజకీయాలనుండి కనుమరుగయ్యారు జేడి లక్ష్మి నారాయణ.
2019 ఎన్నికల తరువాత జేడి లక్ష్మి నారాయణ జనసేనను వీడి తప్పుచేశారా? లేక 2024 ఎన్నికలలో కొత్త పార్టీ పెట్టి తప్పటడుగు వేసారా? అనేది జేడి పునరాలోచించుకోవాలి. రాజకీయాలలోకి అడుగు పెట్టిన వెంటనే విజయం వచ్చి ఒళ్ళో వాలుతుంది అనుకోవడం జేడి అవివేకమే అవుతుంది. రాజకీయాలలో రాజీ లేని పోరాటం చేయడమే రాజకీయం అనేది జేడి తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇప్పటికైనా జేడి రాజకీయాలలో రాణించాలి అంటే ఒక నిర్దిష్టమైన ఆలోచనకు, సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. లేకపోతే రాజకీయాలలో జేడి పేరు కనుమరుగు కావడం తప్పదు.




