కరోనా ఆపత్కాలంలో సినిమా భవిష్యత్తు ఏంటి అనేది అర్ధం కాకుండా ఉంది. ఇప్పటికే మూడు నెలలకు పైగా షూటింగులు ఆగిపోయాయి. ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. అదే విధంగా సినిమా థియేటర్లను ఇప్పట్లో ఓపెన్ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్టుగా లేవు.
ఈ తరుణంలో ఒక డిస్ట్రిబ్యూటర్ చేసిన ప్రకటన భవిష్యత్తు మీద ఆశలు కలిగిస్తుంది. నైజాం ఏరియాలో పాపులర్ డిస్ట్రిబ్యూటర్ అయిన వరంగల్ శ్రీనివాస్, నాలుగు పెద్ద సినిమాల థియేటర్ హక్కులు పొందారు. రవితేజ ఫిల్మ్ ‘క్రాక్’, గోపీచంద్ సినిమా ‘సీటీమార్’, శర్వానంద్ చిత్రం ‘శ్రీకారం’, రానా మూవీ ‘విరాటపర్వం’ నైజాం హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు.
మంచి ధరతో వాటి హక్కులను శ్రీనివాస్ పొందడం గమనించదగ్గ అంశం. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా థియేటర్లు మూతపడక పోయినట్లయితే ఈ పాటికి ఆ సినిమాలన్నీ విడుదలై ఉండేవి. ఈ నాలుగు సినిమాల విడుదల పై క్లారిటీ కూడా లేని తరుణంలో ఈ హక్కులు పొందారంటే… ఖచ్చితంగా సినిమాకు థియేటర్ బిజినెస్ పై ఆశలు ఉన్నట్టే అని ఒక మెసేజ్ పంపగలిగారు.
అదే విధంగా ఈ నాలుగు సినిమాలు డైరెక్టు ఆన్ లైన్ రిలీజ్ అయ్యే అవకాశం లేదు అనేదాని పై కూడా క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. ఈ నాలుగు సినిమాల్లో…. అన్నీ దాదాపుగా తమ షూటింగులను పూర్తి చేసుకున్నవి. ఇంకొన్ని రోజులు షూట్ చేస్తే విడుదలకు సిద్ధం చేసేయ్యొచ్చు. పరిస్థితులు చక్కబడగానే విడుదలయ్యే మొదటి బ్యాచ్ సినిమాల్లో ఇవి ఉంటాయి.





