భువనేశ్వర్ నుండి హైదరాబాద్ కు వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు కృష్ణాజిల్లా, పెనుగంచి ప్రోలు మండలం, ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారి వంతెనపై డివైడరును ఢీకొని, రెండు వంతెనల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో బస్సు ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం అంతా నుజ్జునుజ్జుకాగా, అక్కడికక్కడే ఏడుగురు అశువులు బాసారు. మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు.
ఈ ప్రమాదంలో మరో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు కల్వర్టు మధ్యలో ఇరుక్కుని ఉండటంతో సహాయక చర్యలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బస్సు డ్రైవర్ నిద్రావస్థలో ఉండడం వలనే, ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాలలో స్థానిక ప్రజలు కూడా ముమ్మరంగా పాలుపంచుకోవడం విశేషం.
ఈ సహాయ కార్యక్రమాలలో ఓ అవాక్కయ్యే విషయం వెలుగుచూసింది. ఈ బస్సులో డిక్కీలో సైతం ఓ వ్యక్తి ప్రయాణిస్తుండటం గమనార్హం. బస్సు పూర్తిగా నిండిపోవడంతో అతన్ని డిక్కీలో కూర్చోబెట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు డిక్కీలో వ్యక్తిని చూసి అవాక్కయ్యారు. అతన్ని విశాఖ వాసిగా గుర్తించారు. డిక్కీలో ప్రయాణికుడు ఉన్న ఘటనపై మరో కేసును నమోదు చేయనున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
కాగా, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం గురించిన వివరాలను అడిగి తెలుసుకున్న వైద్య మంత్రి కామినేని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఆదాయ సముపార్జనే పరమావధిగా ప్రైవేటు ట్రావెల్స్ ఎలా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాయో డిక్కీ వ్యవహారం మరోసారి తేటతెల్లం చేసింది.



