‘మహిళా’ రాజకీయాలలో ‘సంస్కారాలు’ తగ్గి ‘మసాలాలు’ పెరిగాయా?

DK Aruna Vs Telangana Speakerగతంతో పోలిస్తే అన్ని రంగాలలో స్త్రీల పాత్ర చాలా వరకు మెరుగు పడిందనే చెప్పాలి. ముఖ్యంగా పురుషుల ప్రాధాన్యత గల రాజకీయ రంగoలో స్త్రీలు మరింతగా రాణిస్తున్నారనే చెప్పాలి. అయితే మహిళా అభివృద్దిని చూసి తోటి మహిళలే భరించలేకపోవడం భాదాకరం. “ఆడవారికి ఆడవారే శత్రువు” అన్న చందంగా నేటితరంలో ఉన్న కొందరి రాజకీయ నాయకీ మణుల ప్రవర్తనా శైలి ఉంటుంది.

రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఉన్న అన్ని పార్టీల అధినేతలు మహిళలకు సముచిత స్థానం ఇచ్చి గౌరవాన్ని పెంచారనే చెప్పాలి. అయితే లభించిన ఈ అవకాశాన్ని కొంతమంది రాజకీయ నేతలు మాత్రం సద్వినియోగం చేసుకోకుండా వారి చేష్టలతో, ప్రవర్తనతో స్త్రీల గౌరవాన్ని దిగజారుస్తున్న వైనం ఆందోళన కలిగించే అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలలో వైసీపీకి చెందిన నగరి నియోజకవర్గపు ఎమ్మెల్యే అయిన రోజా అసభ్య పదజాలంతో, వికృత చేష్టలతో సభలో వింత ప్రవర్తన చేసి సభనే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూడా అపహాస్యం పాలు చేసారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతిపక్ష పార్టీ విధి. అయితే ఆ విమర్శలు ప్రజా ప్రయోజనాలు కాపాడేలా ఉండాలి తప్ప, వ్యక్తిగత కక్ష్య సాధింపుల కోసం కాకూడదు అన్నది కూడా ప్రతిపక్ష పార్టీల బాధ్యతలలోని భాగమే. వ్యక్తులకు కాకపోయినా వారి పదవులకైనా ఖచ్చితంగా గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఆ విలువలను వర్తమాన రాజకీయాలలో ఆశించడం అంటే అది ‘అత్యాసే’ అవుతుందని చెప్పక తప్పదు.

రోజా తన అసభ్య పదజాలంను సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుపైనే ప్రయోగించడం దిగజారుడితనానికి అద్దం పడుతుందని మండిపడ్డ సందర్భాలు కోకొల్లలు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులను, తోటి మహిళా నేతలను సైతం రోజా వదిలిపెట్టలేదు. అటువంటి వారి కోసం జగన్ ఆరాటపడడం స్త్రీలను గౌరవించినట్లా..? అనేది వారి విజ్ఞతకే వదిలేయలేమో..!

తాజాగా తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకోoది. కాంగ్రెస్ పార్టీ సభ్యురాలైన డి.కే.అరుణ డిప్యూటి స్పీకర్ అయిన పద్మ దేవేందర్ రెడ్డిని సంస్కారం లేని వారు సభను నడిపిస్తున్నారని అసెంబ్లీలో వ్యాఖానించారు. ఈ వ్యాఖ్యలతో కలత చెంది కన్నీరు పెట్టడం పద్మ వంతయ్యింది. ప్రభుత్వం తరపున హరీష్ రావు ఈ అంశాన్ని లేవనెత్తుతూ స్పీకర్ కు అరుణ క్షమాపణలు చెప్పాలని కోరినప్పటికీ, స్పీకర్ ఆ విషయాన్ని వారి విజ్ఞతకే వదిలేద్దాం అని సభను ముందుకు నడిపించారు. ఈ పరిణామంతో స్పీకర్ హోదాలో మహిళామణులకు సైతం సభలో గౌరవం లభించడం లేదనే విషయం అవగతమవుతోంది.

నోటిని అదుపులో ఉంచుకొని సభా గౌరవాలను పెంచుకొంటూ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే సభలో అడుగు పెట్టడానికి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకొంటే మంచిదన్న అభిప్రాయం సగటు ప్రజానీకం నుండి వస్తోంది. ముఖ్యంగా స్త్రీలను దేవతలుగా కొలిచే భారతదేశంలో స్త్రీలు సంస్కార హీనులుగా ప్రవర్తించరాదని, “భూదేవి తల్లికి ఉన్నంత ఓర్పు స్త్రీల సొంతమనే” నానుడిని మార్చరాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories