ఒకప్పుడు హైదరాబాద్ నగరం ల్యాండ్ మార్క్స్ లో ఒకటిగా నిలిచిన అమీర్ పేట్ సత్యం థియేటర్ ఇప్పుడు రూపు మార్చుకుని సరికొత్త ఏఏఏ సినిమాస్ గా ప్రారంభమయ్యింది. అల్లు అర్జున్ – ఏషియన్ గ్రూప్ సంయుక్తంగా దీన్ని మొదలుపెట్టాయి. మాల్ తో కూడిన ఈ మల్టీప్లెక్స్ ప్రజలకు ఆదిపురుష్ తో ఈ 16 నుంచి అందుబాటులోకి రానుంది.
మహేష్ బాబు ఎఎంబి సూపర్ ప్లెక్స్ బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు బన్నీ భాగస్వామిగా మారిన ఏఏఏ మీద పడింది. ప్రజలు, పరిశ్రమ దీనిపట్ల ఎలాంటి స్పందన ఇస్తుందనేది కీలకంగా మారింది. ఇప్పటిదాకా ప్రసాద్స్ తో పాటు ఏఎంబి మాల్ సినిమా ప్రేమికులకు బెస్ట్ స్పాట్స్ గా నిలిచాయి. పోలిక ప్రకారం చూసుకుంటే స్క్రీన్ క్వాలిటీ, సౌకర్యవంతమైన సీటింగ్, ఖరీదైన ఇంటీరియర్స్ పరంగా ఎంఎంబిదే పైచేయి అయ్యింది.
అయినప్పటికీ అందుబాటులో ఉన్న స్నాక్స్ ధరల వల్ల ప్రసాద్స్ కి ప్రాధాన్యం ఇచ్చే ఆడియన్స్ లక్షల్లో ఉన్నారు. దీనికి తోడు ప్రతి శుక్రవారం ఉదయం 8.45కు వేసే స్పెషల్ షో వల్ల మీడియా హాజరుతో పాటు మాస్ ఎక్కువ రావడంతో దీనికి పాపులారిటీ దక్కింది. ఎఎంబిలో ఫుడ్డు, డ్రింక్స్ చాలా ఖరీదు. దాన్ని స్థాపించిన లొకేషన్, ఖర్చు పెట్టిన వ్యయంతో చూసుకుంటే ఆ మాత్రం ధరలు పెట్టడం సబబే అయినా ప్రసాద్స్ తో ఉన్న పోటీ దృష్ట్యా ఏమైనా తగ్గించే ఆలోచన చేస్తారేమో చూడాలి.
ఇప్పుడు ఏఏఏ సినిమాస్ లో 8.45 షోలు వేసుకోవచ్చు. కానీ సాధారణంగానే ఆ రోడ్డులో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. దానికి తోడు వన్ వే నిబంధన. ఇప్పుడు కనక ప్రీమియర్లు అక్కడ ప్లాన్ చేసుకుంటే సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కామన్ ఆడియన్స్ రోడ్డులో ఇరుక్కుపోవడం కన్నా వేరే ఆప్షన్ చూసుకుందామనుకుంటే రిస్కే.
ప్రసాద్స్ లో ఇటీవలే ఆధునీకరించిన పిసిఎక్స్ బిగ్ స్క్రీన్ మీద మూవీ లవర్స్ నుంచి విపరీతమైన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. హాలీవుడ్ చిత్రాలకు, విజువల్ గ్రాండియర్స్ కి అందులో బెస్ట్ ఎక్స్ పీరియన్స్ దక్కుతోంది. ఏఏఏలో స్క్రీన్ ఏదైనా దాని స్టాండర్డ్ ని అందుకోవాలి. ఇండస్ట్రీ బిజినెస్ కోణంలో చూసుకుంటే ప్రెస్ మీట్లు, టీజర్, ట్రైలర్ లాంచులు వగైరా రెగ్యులర్ గా ఈ మల్టీప్లెక్సుల్లోనే జరుగుతాయి.
ఇప్పుడు ఏఎంబి, ఏఏఏ పార్ట్ నర్ ఒకరే కాబట్టి నాణ్యత ప్రమాణాల్లో వీటితో ప్రసాద్స్ పోటీ పడటం అంత సులభంగా ఉండదు. ఈవెంట్ ఏదైనా సరే మల్టీప్లెక్సులన్నీ షోలను బుక్ చేసుకోవడానికి ఫుడ్డు, బెవెరేజెస్ ని తీసుకోవాలనే నిబంధన పెడతాయి. ఉదాహరణకు ఎఎంబిలో ఈవెంట్ చేయాలంటే 3.5 లక్షల దాకా అవుతుంది. అదే ప్రసాద్స్ లో అయితే 1.5 నుంచి 2 లక్షల్లో పూర్తి చేయొచ్చు.
కొందరు నిర్మాతలు సీనీమ్యాక్స్ బంజారాహిల్స్ ని ఎంచుకుంటున్నారు. దానికి ట్రాఫిక్ సౌలభ్యం ఒక కారణం. అయితే క్వాలిటీ విషయంలో రాజీపడని ప్రొడ్యూసర్లు మాత్రం ఏఎంబికే ఓటేస్తున్నారు. ఏఏఏ సినిమాస్ కు ట్రాఫిక్ సమస్య ఖచ్చితంగా ఉంటుంది. తిండిపదార్థాల ధరల విషయంలో ఔదార్యంగా ఉంటే వినియోగదారులు కొంత ఇబ్బంది పడినా థియేటర్ కు వస్తారు
ప్రీమియర్లు, ప్రెస్ షోల విషయానికి వస్తే ఎఎంబి మొదటి స్థానంలో నిలుస్తోంది. ఫుడ్డు డ్రింక్స్ రేట్లు ప్రీమియంగా ఉన్నా సరే నిర్మాతలు భరిస్తున్నారు. అందుకే సినీ మ్యాక్స్ రెండో ప్లేస్ లో నిలిచింది. ప్రెస్ షోలకు మాత్రం ఇలాంటి నిబంధనలు లేకపోవడం వల్ల ప్రసాద్ ఆధిపత్యం చూపగలుగుతోంది.
ఏఏఏ సినిమా సక్సెస్ కావడం ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీని అమలు పరుస్తారనే దాని మీద ఆధారపడి ఉంది. ఏఎంబి లాగా ప్రీమియర్ అండ్ స్పెషల్ గా నిలుస్తుందో లేక సామాన్యులకు దగ్గరగా అంటూ వేరే పద్ధతి అవలంబిస్తుందో చూడాలి. ఒకవేళ ఏఎంబి స్టాండర్డ్ అమలుపరిచినా ఏఏఏ సినిమాస్ విజయవంతం కావొచ్చు. అక్కడి అనుభూతికి ఏ మాత్రం తీసిపోని ఫీలింగ్ ఇక్కడా కలుగుతోందని ఆడియన్స్ భావిస్తే సాధ్యమవుతుంది.
భారీ జన సాంద్రత, విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రాంతం, యూత్ తిరుగాడే పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ లాంటివి దగ్గరగా ఉండటం, సిటీకి వచ్చే బయటివాళ్లకు ఇదే సెంటర్ కావడం ఏఏఏకు అనుకూలంగా ఉంటాయి. మరి ఏ సూత్రాలను పాటించి బన్నీ అండ్ ఏషియన్ ఈ మల్టీప్లెక్స్ ని జనాలకు దగ్గర చేస్తారో చూడాలి.



