లోక్సభ ఎన్నికలలో బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయంటూ బిఆర్ఎస్ నేతలు మీడియాకు లీకులు ఇస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత నలుగురూ పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలు మెజారిటీ సీట్లు దక్కించుకుంటే, బిఆర్ఎస్ నుంచి వలసలు మొదలైపోతాయని వారికి తెలుసు.
అదీగాక బిఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు వాటి వలన తెలంగాణకు కలిగిన నష్టాన్ని శ్వేతపత్రాలు, గణాంకాలతో సహా కాంగ్రెస్ మంత్రులు బయటపెడుతూ, ‘కల్వకుంట్ల బ్యాచ్’ జైలుకి వెళ్ళక తప్పదని హెచ్చరిస్తుండటం వారికి చాలా ఆందోళన కలిగించే విషయమే. మరోపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇంకా ‘యాక్టివ్’గానే ఉంది.
కనుక బీజేపీతో పొత్తు పెట్టుకుని ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడవచ్చని కేసీఆర్ భావిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికలలో బీజేపీతో పొత్తు కుదిరితే బిఆర్ఎస్ ఓడిపోయే సీట్లను బీజేపీకి అప్పగించేసి ఓటమి నుంచి తప్పించుకోవచ్చుననే ఆలోచన కూడా ఉండవచ్చు.
కానీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ‘మోడీ… గీడీలకు బుద్ధి లేదు. దేశాన్ని పాలించడం చాతకాదు. బీజేపీ దేశానికి పట్టిన దరిద్రం… దానిని పీకి బంగాళాఖాతంలో విసిరేస్తానంటూ,’ కేసీఆర్ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడిన మాటలను, ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ వస్తే కేసీఆర్ మొహం చాటేసి మంత్రి తలసానిని పంపించి అవమానించడం మోడీ, అమిత్ షాలు మరిచిపోతారని కేసీఆర్ అనుకుంటే అంతకంటే అవివేకం లేదు.
తెలంగాణ బీజేపీ కూడా ఇంతకాలం కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీతో పోరాడుతూనే ఉంది. ఇప్పుడు ‘శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవలసిన అవసరం మాకేమిటి? బుద్ధున్నవాడు ఎవడూ కేసీఆర్, బిఆర్ఎస్తో పొత్తు పెట్టుకోడు…’ అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీకి కూడా బిఆర్ఎస్తో పొత్తులకు సిద్దంగా లేదని స్పష్టం చేస్తోంది.
కేసీఆర్ అహంకారంతో బీజేపీని, దాని మిత్రపక్షాలను దూరం చేసుకోగా, తన వద్ద ఉన్న డబ్బుతో దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటినీ శాసించవచ్చనే అహంకారంతో విర్రవీగడం వలన కాంగ్రెస్ మిత్రపక్షాలని కూడా దూరం చేసుకున్నారు. కనుక ఇప్పుడు ఆయన దేశ, రాష్ట్ర రాజకీయాలలో ఒంటరిగా మిగిలిపోయారు.
యావత్ దేశ రాజకీయాలనే శాసిద్దామనుకున్న కేసీఆర్ ఇప్పుడు తన పార్టీ చెల్లాచెదురు అయిపోకుండా ఎలా కాపాడుకోవాలని ఆరాటపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా?




