జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ్మ ఒడి’ పధకం పేరుని టిడిపి కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’గా మార్చింది. అది ఏ ఉద్దేశ్యంతో ఆ పేరు పెట్టినప్పటికీ ఇప్పుడు జగన్ ఆ పధకం గురించి మాట్లాడేందుకు ఇబ్బంది పడవలసివస్తోంది.
‘తల్లికి వందనం’ అని పలికిన ప్రతీసారి తల్లి విజయమ్మని తాను ఎంతగా అవమానించారో జగన్కి గుర్తురాక మానదు. వైసీపి కష్టకాలంలో విజయమ్మ ఆ పార్టీని తల్లిలాగే ఆదుకున్నారు. కానీ జగన్ ముఖ్యమంత్రి కాగానే తల్లిని పార్టీలో నుంచి, రాష్ట్రంలో నుంచి కూడా బయటకు గెంటేశారు.
ఆమె కన్నీరు పెట్టుకుంటూ తెలంగాణలో కూతురు షర్మిల వద్దకు వెళ్ళిపోతున్నాని వేదికపై చెపుతున్నప్పుడు, ఆ సభకు వచ్చిన వైసీపి నేతలు, కార్యకర్తలు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. కానీ వేదికపై ఆమె పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వారు.
తల్లిని ఇంతగా అవమానించి బాధపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ‘తల్లికి వందనం’ అని పలకడం ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయినప్పటికీ అదేమీ గుర్తులేన్నట్లు ‘తల్లికి వందనం’ పధకాన్ని సిఎం చంద్రబాబు నాయుడు అమలుచేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ జగన్ మాట్లాడారు.
అయితే ఆ పధకం గురించి ప్రభుత్వాన్ని నిలదీయాలనుకుంటే శాసనసభకు వచ్చి అడగాలి. కానీ శాసనసభకి రావడానికి భయపడుతూ తాడేపల్లి ప్యాలస్లో కూర్చొని శాసనసభ సమావేశాలపై ‘రన్నింగ్ కామెంట్రీ’ ఇవ్వడం దేనికి?
జగన్ ముఖ్యమంత్రి అయిన దాదాపు ఆరేడు నెలల తర్వాత ‘అమ్మ ఒడి’ పధకం ప్రారంభించిన సంగతిని టిడిపి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే అన్ని హామీలు అమలుచేయాలని అడగటానికి సిగ్గు లేదా?’ అని అడుగుతోంది. జగన్ వద్ద జవాబు ఉందా?




