వైసీపీ నుంచి మరో అసమ్మతి గళం సోషల్ మీడియా వేదికగా బయటకొచ్చింది. వ్యక్తిగత వివాదాలతో పార్టీకి దూరం అయిన దువ్వాడ శ్రీనివాస్ ఈ మధ్యకాలంలోనే పార్టీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. దీనితో ఇక వైసీపీలోకి దువ్వాడ రీ ఎంట్రీ అంటూ వైసీపీ దువ్వాడ అభిమానులు హడావుడి చేసారు.
అయితే ఇప్పుడు దువ్వాడ తన సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ వైసీపీ లోకి ఆయన రీ ఎంట్రీ పై పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. తాజాగా టెక్కలిలో మాజీ మంత్రి ధర్మాన నేతృత్వంలో ‘మూలపేట పోర్ట్ కి పోదాం’ రండి అంటూ వైసీపీ ఇచ్చిన పిలుపు, చేసిన కార్యక్రమం పై దువ్వాడ ఇది ఎంత అధర్మం.? అంటూ పోస్ట్ చేసారు.
మూలపేట పోర్ట్ కి పోదాం అంటూ వైసీపీ నేతలు చేసిన కార్యక్రమం అంతా ఒక రాజకీయ డ్రామా అని, పోర్ట్ లోపలికి 40 మందికి అనుమతి ఉన్నప్పటికీ ధర్మాన లోపలికి పోకుండా అధర్మంగా పోర్ట్ కి 10 మీటర్ల దూరంలో టెంట్లు వేసుకుని మాట్లాడి వెళ్లిపోయారని విమర్శించారు.
పోర్ట్ కు 100 మీటర్ల రోడ్ కోసం భూములిచ్చిన వారి త్యాగాల గురించి ఆ కార్యక్రమంలో ఎక్కడ ప్రస్తావించలేదని, వారి సమస్యల పై వైసీపీ నేతలు అసలు గొంతు విప్పలేదని, వైసీపీ ఇచ్చిన పిలుపుతో తమ ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి వెళతాయని, సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశపడిన నిర్వాసితులకు చివరికి నిరాశే మిగిలిందంటూ వైసీపీ కి వ్యతిరేకంగా గళం విప్పారు దువ్వాడ.
అయితే గతంలో శాసనమండలిలో వైసీపీ నేతలు తిరుమల లడ్డు వివాదం పై సభలో చర్చ జరుగుతుండగా సభ నుంచి వాకవుట్ అంటూ బయటకు వెళ్లినా దువ్వాడ మాత్రం వైసీపీ ఎమ్మెల్సీ లతో పాటుగా సభ నుంచి బయటకు వెళ్ళలేదు, చర్చలో పాల్గొన్నారు.
ఇక ఇప్పుడు టెక్కలి కేంద్రంగా వైసీపీ తలపెట్టిన కార్యక్రమాన్ని వేలెత్తి చూపుతూ, అధర్మం అంటూ గళం విప్పారంటే దువ్వాడ త్వరలో వైసీపీ కి గుడ్ బై చెప్పనున్నారా.? అందులో భాగమే దువ్వాడ స్వరంలో ఈ మార్పా.? అంటూ సోషల్ మీడియాలో దువ్వాడ పొలిటికల్ జర్నీ పై ఉహాగానాలు ఊపందుకున్నాయి.






