సీనియర్ టిడిపి నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకి చెందిన ట్రాన్స్స్టాయ్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయాలు, దాని డైరెక్టర్ల ఇళ్ళపై మంగళవారం ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈరోజు ఉదయం నుంచి హైదరాబాద్లోని పంజగుట్ట, జూబ్లీహిల్స్, మణికొండ, ఏపీలోని గుంటూరులో ఆ కంపెనీ డైరెక్టర్ల ఇళ్ళు, కార్యాలయాలలో కలిపి మొత్తం తొమ్మిది చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
రాయపాటికి చెందిన ట్రాన్స్స్టాయ్ కంపెనీపై గతంలోనే 13 బ్యాంకుల నుంచి రూ.9,000 కోట్లు రుణాలు తీసుకొని వాటిని తమ అవసరాల కోసం సృష్టించిన నకిలీ కంపెనీల ద్వారా సింగపూర్కు అక్రమంగా బదిలీచేసినందుకు ఈడీ ఇదివరకే మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీలలో రాయపాటి, మలినేని సాంబశివరావులతో పాటు మరికొంత మంది డైరెక్టర్లుగా ఉన్నారు. వారందరి ఇళ్ళలో నేడు ఈడీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.
అయితే ఇప్పుడు ఐటి, ఈడీ, సీబీఐ సోదాలు, విచారణ, కేసులు, అరెస్టులు ప్రతీదానికి ఎక్కడో అక్కడ రాజకీయకోణం ఉండటం చాలా కామన్ కనుక ఎన్నికలకు దగ్గరపడుతున్న సమయంలో రాయపాటిని ఈడీ టార్గెట్ చేయడం వెనుక బిజెపి హస్తం ఉందేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మొదట ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆ పార్టీ ఓడిపోతుందని పసిగట్టగానే టిడిపిలోకి వచ్చేశారు. ఇప్పుడు టిడిపిలో టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తానని హెచ్చరించారు. కనుక ఆయనను బిజెపిలోకి రప్పించేందుకే ఇప్పుడు ఈడీ చేత కేంద్రం దాడులు చేయిస్తోందా? లేదా నిజంగానే మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ దాడులు చేస్తోందా?అనే ప్రశ్నలకు త్వరలోనే జవాబు లభించవచ్చు.



