జగన్ ఆస్తుల స్వాధీనానికి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కౌంట్ డౌన్ మొదలుపెట్టింది. మరో పది రోజుల్లో జగన్ నివాసం మరియు ‘సాక్షి’ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఈడీ రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఆస్తుల స్వాధీనానికి సహకరించాలంటూ గురువారం నాడు ఈడీ జగన్ కు నోటీసులు జారీ చేసింది. జగన్ నివాసంతో పాటు, సాక్షి కార్యాలయానికి వెళ్లిన అధికారులు నోటీసులు అందజేశారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డికి చెందిన ఏయే ఆస్తులను స్వాధీనం చేసుకోబోతున్నదీ ప్రకటన కూడా విడుదల చేశారు.
వాస్తవానికి ఆస్తుల స్వాధీనానికి ఈడీ నెలన్నర సమయం ఇస్తుంది. అయితే అత్యంత తీవ్రమైన నేరాల్లో కేవలం పది రోజులు మాత్రమే గడువు ఇస్తుంది. ఇప్పుడు జగన్ విషయంలో అదే జరిగింది. ఈడీ నోటీసులు అందడంతో జగన్ శిబిరంలో కలకలం మొదలైంది. నోటీసులు అందుకున్న జగన్ శిబిరానికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలా స్పందించాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. హైకోర్టును ఆశ్రయించాలన్నా సోమవారం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి. అప్పటికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని భయపడుతోంది.
ఈ నెల 20 లోపు ఈడీ నోటీసులపై స్టే తెచ్చుకోవాల్సిన పరిస్థితి జగన్ శిబిరాన్ని కలవర పెడుతోంది. కోర్టు స్టే ఇవ్వకుంటే పరిస్థితి ఏంటన్న దానిపై ఆందోళన మొదలైంది. హైకోర్టు కనుక స్టే ఇవ్వకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించేంత సమయం ఉంటుందా? లేదా? అన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈడీ కనుక ఆస్తులు స్వాధీనం చేసుకుంటే ప్రజల్లో అది జగన్ కు ప్రతికూల అంశంగా మారుతుందని వైసీపీ నేతలు భావిస్తున్న తరుణంలో, వీలైనంత త్వరగా స్టే తెచ్చుకునేందుకే ప్రయత్నిస్తున్నారు.
ఇక, ఆస్తుల వివరాలను పరిశీలిస్తే… హైదరాబాద్ లోని సాక్షి దినపత్రిక ప్రధాన కార్యాలయం, లోటస్ పాండ్ లో ఉన్నజగన్ విలాసవంతమైన నివాసం, కడప మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిళ్లపల్లిలో ఉన్న హరీశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన 7.85 ఎకరాల భూమి, సైబరాబాద్లోని రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ లో నివిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు చెందిన 9680 చదరపు గజాల స్థలం, మహేశ్వరం మండలం సర్దార్ నగర్ రెవెన్యూ గ్రామంలో ఉన్న 32.31 ఎకరాల భూమిని ఈడీ స్వాధీనం చేసుకోనుంది.



