చూస్తుండగానే 8 నెలలు.. సమయం తక్కువ ఉంది మిత్రమా!

Eight Month Completed For TDP

చంద్రబాబు నాయుడు గత ఏడాది జూన్ 12న ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే రేపటితో 8 నెలలు పూర్తవుతాయన్న మాట!

ఆనాడు రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పుడు ఏవిదంగా ప్రతీదీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సి వచ్చిందో 5 ఏళ్ళ జగన్‌ పాలన తర్వాత కూడా అలాగే అన్నీ మొదటి నుంచి మొదలుపెట్టాల్సి వచ్చింది. అమరావతి ఇందుకు నిలువెత్తు నిదర్శనం.

ADVERTISEMENT

అయితే ఈ 8 నెలల్లో గుంతలు పడిన రోడ్ల మరమత్తులు మొదలు లక్షల కోట్లు పెట్టుబడులు రప్పించడం వరకు చాలా పనులే చేశారు.

ఓ కుటుంబ యజమాని అయినా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా దేశాధినేత అయినా అవసరమైనవి, అత్యవసరమైనవి గుర్తించడం చాలా ముఖ్యం. అప్పుడే ప్రాధాన్యతలు, వాటిని బట్టి ఖర్చులు లెక్కతెలుస్తాయి.

జగన్‌ చేసిన ఆర్ధిక విధ్వంసం కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నం అయినప్పటికీ, సిఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మొట్ట మొదట పింఛన్లు రూ.4,000 కి పెంచి అమలుచేస్తున్నారు. ఎందువల్ల అంటే దానిపైనే ఆధారపడి కొన్ని లక్షల మంది జీవిస్తున్నారు కనుక.

దానిని అత్యవసర జాబితాలో చేర్చి వెంటనే అమలుచేసిన సిఎం చంద్రబాబు నాయుడు, మిగిలిన పధకాల అమలుకి తొందరపడటం లేదు. ఎందువల్ల అంటే అవి అవసరమే కానీ అత్యవసరం కావు కనుక. అంతకంటే అత్యవసరమైనవి సుమారు లక్ష కోట్ల పెండింగ్ బిల్లులు బకాయిలున్నాయి. కనుక వాటిని చెల్లించి జగన్‌ బాధితులకు ఉపశమనం కలిగిస్తున్నారు.

ఇక కూటమిలో మూడు పార్టీల మద్య ఇంతవరకు సఖ్యతగానే ఉన్నాయి. అందరూ సిఎం చంద్రబాబు నాయుడు నిర్ణయాలను, ఆదేశాలను గౌరవిస్తున్నారు. ఆయన కూడా మంత్రులను డమ్మీలుగా ఉంచి తాను కర్ర పెత్తనం చేయాలనుకోకుండా వారికీ పూర్తి స్వేచ్చనివ్వడంతో అందరూ ఉత్సాహంగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన సహాయసహకారాలు లభిస్తున్నాయి.

కనుక అంతా సానుకూలంగా ఉంది. కానీ సంక్షేమ పధకాల అమలు విషయంలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం అలసత్వం చూపుతున్నట్లు అనిపిస్తుంది. పైగా కూటమి పార్టీల మద్య చిచ్చు పెట్టేందుకు పట్టువదలని విక్రమార్కుడులా వైసీపీ ప్రయత్నిస్తూనే ఉంది.

కనుక తమ మద్య బంధం మరింత బలోపేతం చేసుకునేందుకు మూడు పార్టీలు గట్టిగా ప్రయత్నించాలి. దానిని ప్రదర్శించాలి కూడా. కానీ అవి సమిష్టిగా ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోకపోవడంతో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం వలన ప్రజలకు కూటమి సఖ్యత గురించి అపోహలు మొదలయ్యే ప్రమాదం పొంచి ఉంది.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఎన్నికల హామీలు అమలుచేసేందుకు సిఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. కానీ సంక్షేమ పధకాలు కావాలంటే వైసీపీయే రావాలనే భావన ప్రజలలో కల్పించేందుకు జగన్‌ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కనుక కాస్త ఆలస్యమైనా కూటమి ప్రభుత్వం హామీలలో కనీసం 60 శాతం నెరవేర్చడం చాలా అవసరం.

చూస్తూ ఉండగానే ఇట్టే 8 నెలలు గడిచిపోయాయి. 2028 మే నుంచి ఎన్నికల సంవత్సరం మొదలైన్నట్లే. అప్పటి నుంచి ఎన్నికల హడావుడి మెల్లగా మొదలవుతుంది కనుక అభివృద్ధి, పరిశ్రమలు, పాలనపై ఇంతగా ఫోకస్ పెట్టడానికి సమయం ఉండదు. అంటే మద్యలో మరో రెండున్నర సంవత్సరాలు మాత్రమే సమయం మిగిలి ఉందన్న మాట. కనుక ఆలోగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం, ప్రజలను మెప్పించడం, వైసీపీ బెడదని వదిలించుకోవడం కత్తి మీద సామే. సిఎం చంద్రబాబు నాయుడుకి ఈ సాము అలవాటే కనుక బాగానే చేస్తారని ఆశిద్దాం.

ADVERTISEMENT
Latest Stories