ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందంటూ మీడియాకు ఈడీ ఓ ప్రెస్నోట్ విడుదల చేసింది.
తాము హైదరాబాద్తో సహా దేశవ్యాప్తంగా 245 ప్రాంతాలలో సోదాలు నిర్వహించి, పలువురిని అరెస్ట్ చేసి, ఈ కేసుకు సంబందించి పూర్తి సాక్ష్యాధారాలు సేకరించామని ఈడీ పేర్కొంది. ఈ కేసులో కల్వకుంట్ల కవిత తదితరులు ఢిల్లీలోని ఆమాద్మీ ప్రభుత్వ పెద్దలకు రూ.100 కోట్లు చెల్లించి తమకు అనుకూలంగా మద్యం పాలసీ 2021-22ని ప్రకటింపజేసుకున్నారని ఈడీ పేర్కొంది.
ఈ దర్యాప్తులో ఇప్పటి వరకు రూ.128.79 కోట్లు స్వాధీనం చేసుకున్నామని, కల్వకుంట్ల కవిత ఈ నేరంలో కీలక పాత్ర పోషించారని, అందుకే మార్చి 15వ తేదీన ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశామని, ప్రస్తుతం ఆమె తమ కస్టడీలోనే ఉన్నారని ఈడీ ప్రెస్నోట్లో పేర్కొంది.
ఈ కేసుతో కల్వకుంట్ల కవితకు ఎటువంటి సంబందమూ లేదని, దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారని, ఈలోగానే ఈడీ అరెస్ట్ చేయడం కోర్టు ధిక్కారమే అని కేటీఆర్, హరీష్ రావు తదితరులు వాదిస్తున్నారు.
వారి ఆరోపణలకి ఈడీ న్యాయవాది ఢిల్లీ సీబీఐ కోర్టులోనే సూటిగా సమాధానం చెప్పారు. కానీ అందరికీ తెలిసిన ఈ వివరాలతో ఈడీ మళ్ళీ ప్రెస్నోట్ విడుదల చేయడం బహుశః కేసీఆర్ను హెచ్చరించడం వంటిదే అని భావించవచ్చు. ఈసారి లోక్సభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ అభ్యర్ధులకు అడ్డు తగలొద్దు… తగిలితే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయని ఈవిదంగా హెచ్చరించిన్నట్లే భావించవచ్చు.
ఇదివరకు ఈ కేసులో కవితకి నోటీస్ పంపినప్పుడు కేసీఆర్ తదితర బిఆర్ఎస్ నేతలు మోడీ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఈ కేసుతో తమని భయపెట్టి లొంగదీసుకోవాలని చూస్తోందని, కానీ మోడీగీడీలకు ఈడీ బేడీలకు భయపడే ప్రసక్తే లేదని ప్రగల్భాలు పలికేవారు.
కానీ ఇప్పుడు కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయినప్పుడు కేసీఆర్ మౌనంగా ఉండిపోయారు. ఎందుకు? అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ పదవి అధికారం కోల్పోయి ఇప్పుడు చాలా దయనీయ స్థితిలో ఉన్నందున, బిఆర్ఎస్ పార్టీ నేతలు ఇదివరకులా ఈ కేసులో మోడీ ప్రభుత్వాన్ని ‘గట్టిగా’ నిందించడం లేదు. మొక్కుబడిగా నిందిస్తుండటం గమనిస్తే, మోడీకి ‘సరెండర్’ అయిపోయేందుకు సిద్ధంగానే ఉన్నట్లు అర్దమవుతోంది. కనుక ఈడీ తాజా ప్రెస్నోట్తో పూర్తిగా ‘సరెండర్’ కాక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. కూతురుని కాపాడుకోవడం కోసం కేసీఆర్కు ఇంతకు మించి వేరే దారి లేదు కూడా. అప్పుడే ఆమెకు బెయిల్ లభిస్తుంది. ఈ కేసు మళ్ళీ అటకెక్కిపోతుంది.
అయితే తెలంగాణ ఆత్మగౌరవం కోసం మోడీతో యుద్ధం చేస్తున్నానని ఇంతకాలం గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ ఇప్పుడు కూతురు కోసం బిఆర్ఎస్ పార్టీని మోడీకి తాకట్టు పెడితే ఆ పార్టీలో మిగిలిన నేతలు కూడా బయటకు వెళ్ళిపోకుండా ఉంటారా? లోక్సభ ఎన్నికలకు ముందు లేదా తర్వాత ఈ ప్రశ్నలన్నిటికీ తప్పకుండా సమాధానాలు లభిస్తాయి.




