బంగ్లాదేశ్కి పాక్ నుంచి విముక్తి కల్పించి స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించేందుకు భారత్ ఎంతగానో సాయం చేసింది. ఆ తర్వాత భారత్ ప్రభుత్వాలు మారినా బంగ్లాదేశ్కి నిలద్రొక్కుకొనేందుకు ప్రతీ ప్రభుత్వం సాయపడుతూనే ఉంది. ఇరుదేశాల మద్య చక్కటి వాణిజ్యం, సత్సంబంధాలున్నాయి. భారత్-బంగ్లాదేశ్ మద్య రైళ్ళు కూడా నడుస్తున్నాయి.
ఇటీవల ఆ దేశంలో ప్రజా తిరుగుబాటు జరిగినప్పుడు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ప్రాణభయంతో పారిపోయి వస్తే భారత్ ఆమెకు సగౌరవంగా ఆహ్వానించి ఆశ్రయం కల్పించింది. ఆమె ఒక్కరే కాదు… అల్లర్లు మొదలైన తర్వాత అనేక వేలమంది ముస్లింలు కూడా భారత్కు శరణార్దులుగా వస్తున్నారు లేదా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ విషాదం ఏమిటంటే షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత జరిగిన విధ్వంసంలో అనేక మంది హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. భారత్ పట్ల కొన్ని వర్గాలు విద్వేషం ప్రదర్శిస్తున్నాయి.
అయితే నేపాల్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ విషయంలో కూడా భారత్కు ఇటువంటి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. ఈ పొరుగు దేశాలన్నిటికీ భారత్ చేయని సాయం లేదు. వాటి అభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. భారత్ వంటి అతిపెద్ద దేశంతో వ్యాపార, వాణిజ్య సంబందాల వలన ఆ దేశాలు ఎంతో లబ్ధి పొందుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ దేశం తాలిబన్ల నుంచి విముక్తి పొందిన సమయంలో భారత్ ఆ దేశంలో పలు అభివృద్ధి పనులు చేపట్టి పూర్తిచేసింది. కానీ అప్పుడూ అక్కడి భారత్ ఎంబసీ మీద బాంబు దాడులు జరుగుతూనే ఉండేవి.
శ్రీలంక ఎల్టీటీఈ తమిళ వేర్పాటువాదంతో తీవ్ర ఇబ్బందిపడుతున్నప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ శాంతి సేనలు పంపించి ఆ దేశానికి సాయపడ్డారు. దాని వలన తమిళనాడులో రాజకీయపార్టీలకు, ప్రజలకు ఆగ్రహం కలుగుతుందని తెలిసి ఉన్నా పంపించారు. కానీ శ్రీలంకకు సాయపడి చివరికి ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. శ్రీలంకకు భారత్కు ఎప్పుడూ విడదీయరాని అనుబందమే ఉంది. కానీ శ్రీలంక భారత్ కాదని చైనాకు దగ్గరైంది. ఆ దేశపు అణ్వస్త్ర సబ్ మెరైన్లను, యుద్ధ నౌకలకు చోటు ఇచ్చింది. ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడు కూడా చైనా ప్రలోభాలకు తలొగ్గి భారత్ని వద్దనుకున్నారు.
కానీ ఇరుగు పొరుగు దేశాలు మనతో ఏవిదంగా వ్యవహరిస్తున్నా కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ వాటి పట్ల చాలా ఔదార్యంగా, సక్యతగానే వ్యవహరిస్తుంటాయి. కరోనా సమయంలో ఇరుగు పొరుగు దేశాలు అల్లాడిపోతుంటే ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశాలకు భారత్లో తయారైన కరోనా టీకాలు, ఇతర సామాగ్రిని పంపించి ఆదుకున్నారు.
ఇరుగు పొరుగుదేశాలపట్ల చాలాఇరుగు పొరుగు దేశాల పట్ల భారత్ ఇంత ఉదారంగా సాయం చేస్తున్నా, ఆయా దేశాలలో భారత్ పట్ల ద్వేషభావం వ్యక్తం అవుతుండటం విస్మయం కలిగిస్తుంది.
అంటే వాటి విషయంలో భారత్ దౌత్యవిధానం సరిగా లేదా లేక భారత్ అవసరమైన దాని కంటే చాలా ఉదారంగా వ్యవహరించడం వలన అందరికీ అలుసుగా మారిందా? అనే సందేహాలు కలుగుతాయి.




