ముగ్గురు చిన్నారి మనవళ్ళు, కోడలు సారికతో సహా మాజీ ఎంపీ రాజయ్య ఇంట్లో సజీవ దహనం అయిన ఘటనను దాదాపుగా అందరూ మరిచిపోయారు. సరిగ్గా తెలంగాణా ఉప ఎన్నికలకు ముందు జరిగిన ఈ సంఘటన రాజయ్య పొలిటికల్ కెరీర్ ను మార్చివేయడమే కాకుండా మొత్తం కుటుంబం కటకటాల పాలయ్యేలా చేసింది.
అప్పటి నుండి జిల్లా సెంట్రల్ జైలులో ఉన్న రాజయ్య కుటుంబం బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నాలు చేసింది. వీరు బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని చెప్తూ ఇప్పటివరకు బెయిల్ ను నిరాకరిస్తూ వచ్చిన కోర్టు ఎట్టకేలకు రాజయ్య కుటుంబానికి మోక్షాన్ని ప్రసాదించింది. రాజయ్య కొడుకు అనిల్ రెండో భార్య మినహా రాజయ్యకు, భార్య మాధవికి, కొడుకు అనిల్ లకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
బెయిల్ మంజూరు కావడంతో ఊపిరి తీసుకున్న రాజయ్య కుటుంబం సంగతి అలా ఉంచితే, అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సారికకు, ముగ్గురు పిల్లలకు సరైన న్యాయం జరిగినట్లేనా..? అసలు జరుగుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటారా?



