లోక్సభ ఎన్నికలలో 7వ మరియు చివరి విడత పోలింగ్ శనివారం జరుగబోతోంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 57 ఎంపీ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగబోతోంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6లోగా క్యూ లైన్లలో ఉన్నవారందరికీ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది కనుక రాత్రి 8-9 గంటలకు పోలింగ్ ముగిసే అవకాశం ఉంటుంది.
ఈ ఆఖరి దశ పోలింగ్ ముగిసేవరకు దేశంలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించరాదని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆంక్ష విధించినందున సర్వేలు చేసి నివేదికలతో సిద్దంగా ఉన్న మీడియా సంస్థలన్నీ తమ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి.
జాతీయ స్థాయిలో ఈసారి బీజేపీ చెప్పుకుంటున్నట్లుగా 370-400 ఎంపీ సీట్లు వస్తాయా రావా? కాంగ్రెస్ నేతలు, కేసీఆర్ వంటివారు చెపుతున్నట్లు ఈసారి బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అంత మెజార్టీ కూడా రాదా? ఇండియా కూటమి చెప్పుకుంటున్నట్లు ఈసారి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాబోతోందా?లేక కేసీఆర్ చెప్పిన్నట్లుగా అటు ఎన్డీయే, ఇటు ఇండియా కూటమికి మెజార్టీ రాక హంగ్ ఏర్పడబోతోందా?
అప్పుడు బిఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పబోతున్నాయా? అనే ప్రశ్నలన్నిటికీ రేపు సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ లో సమాధానం లభించవచ్చు.
తెలంగాణ రాజకీయాలతో లోక్సభ ఎన్నికలకు సంబంధం లేనప్పటికీ, ఈసారి మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలలో ఏది ఓడిపోతే అది భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలే చెప్పుకుంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్, బీజేపీలు కలిసి దానిని ఖాళీ చేసేయడానికి సిద్దంగా కాసుకు కూర్చున్నాయి.
కాంగ్రెస్ ఓడిపోతే బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్దంగా కాసుకు కూర్చున్నాయి. బీజేపీ ఓడిపోతే ఆ పార్టీలో నేతలు గోడ దూకేసే అవకాశం ఉంది. కనుక తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలపైనే ఎక్కువ ప్రభావం చూపబోతున్నాయి.
ఈసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు ఏపీలో లోక్సభ ఎన్నికలు వెలవెలబోయాయంటే అతిశయోక్తి కాదు. లోక్సభ సీట్లకు ఇటు వైసీపి, అటు టిడిపి కూటమి హోరాహోరీ పోరాడినప్పటికీ అందరి దృష్టి శాసనసభ ఎన్నికల ఫలితాల మీదనే ఉందని చెప్పవచ్చు.
రాష్ట్రంలో మారిన ప్రజల మూడ్, మారిన పార్టీల బలాబలాలు, కుల సమీకరణాలు, వైసీపికి హెల్పింగ్ హ్యాండ్ కేసీఆర్ సాయం చేయలేని పరిస్థితిలో ఉండటం వంటి పరిణామాలన్నీ ఈసారి వైసీపి ఓటమినే సూచిస్తున్నాయి.
కానీ జూన్ 4న వెలువడే ఫలితాలు చూసి యావత్ దేశం షాక్ అవబోతోందని జగన్మోహన్ రెడ్డి నమ్మకంగా చెపుతున్నారు. అంటే మొదటి సారి భారీ మెజార్టీతో గెలిచి రెండోసారి దారుణంగా ఓడిపోతే అది చూసి దేశ ప్రజలు షాక్ అవుతారని ఆయన ఉద్దేశ్యమో లేక నిజంగానే 175/25 సీట్లు గెలిచేసుకున్నప్పుడు చూసి షాక్ అవుతారని చెప్పారో తెలీదు. కానీ ఫలితం ఎలా ఉండబోతున్నా జగన్ చెప్పిన్నట్లు దేశ ప్రజలందరూ కూడా ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారనేది వాస్తవం.
ఈసారి ఎన్నికలలో టిడిపి కూటమి కనీసం 110-120 సీట్లు గెలుచుకుంటుందని మొదట అంచనా వేసినప్పటికీ పోలింగ్ సరళి చూసిన తర్వాత కనీసం 120-140 మద్యలో ఉండవచ్చని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపి ఆక్రందనలు కూడా టిడిపి కూటమి గెలుపునే సూచిస్తున్నట్లున్నాయి.




