మరో మూడు రోజులలో ఎగ్జిట్ పోల్స్, ఆ తర్వాత మరో మూడు రోజులలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి.
ఓటమి తప్పదని ఆందోళన చెందుతున్న వైసీపికి జూన్ 1వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించరాదని ఈసీ ఆంక్షలు మరి కొన్ని రోజులు ఉపశమనం కలిగిస్తుండగా, మెజార్టీ లెక్కలు కట్టుకుంటూ ఆతృతగా ఎదురుచూస్తున్న టిడిపి కూటమి నేతల సహనాన్ని పరీక్షిస్తున్నట్లవుతోంది.
ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాల గురించి ఎగ్జిట్ పోల్స్ ఏమి చెప్పబోతున్నాయో అందరికీ తెలిసి ఉన్నప్పటికీ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
వాటితో తమ విజయంపై మరింత స్పష్టత వస్తుందని కూటమి నేతలు ఆతృతగా ఎదురుచూస్తుంటే, కనీసం ఎగ్జిట్ పోల్స్ అయినా తమకు అనుకూలంగా రాకపోతాయా… అని వైసీపి నేతలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే టిడిపి, జనసేన, బీజేపీలు పొత్తులు, సీట్ల సర్దుబాట్లు చేసుకుని కలిసికట్టుగా ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడే అవి సగం విజయం సాధించాయని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఈసారి పవన్ కళ్యాణ్ చాలా పరిణతితో వ్యవహరిస్తూ, కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించడంలో సఫలం అయ్యారు. ఇది జనసేన గెలుపుకే కాక ఇతర ప్రాంతాలలో టిడిపి, బీజేపీలకు జనసేన ఓట్లు బదిలీకి ఎంతగానో తోడ్పడుతుంది.
అలాగే వర్మ వంటి పలువురు టిడిపి సీనియర్ నేతలు, టిడిపి కోసం ప్రాణం పెట్టే కార్యకర్తలు కూడా జనసేన, పవన్ కళ్యాణ్ కోసం ఎంతగానో శ్రమించారు. కనుక జనసేనకు కూడా టిడిపి ఓట్లు బదిలీ అవడం ఖాయమే.
కానీ టిడిపి, జనసేనల ఓట్లు ఏ మేరకు బీజేపీకి బదిలీ అయ్యాయనేది ఫలితాలు వెలువడితే కానీ తెలియదు. అయితే ఈసారి టిడిపి, జనసేనల ప్రభంజనం చాలా బలంగా ఉన్నందున దానిలో బీజేపీ కూడా ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి.
టిడిపి కూటమి గెలుపుని, వైసీపి ఓటమిని సజ్జల రామకృష్ణా రెడ్డి, పేర్ని నాని వంటి వైసీపి నేతలే తమ వాదనలతో పదేపదే ధృవీకరిస్తూనే ఉన్నారు. కనుక జూన్ 1, జూన్ 4 తేదీలలో వారి అంచనాలు మరోసారి ధృవీకరించడం కేవలం లాంఛనప్రాయమే అని భావించవచ్చు.




