తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ, ఇళవరసి, సుధాకరన్ ల అక్రమాస్తుల కేసులో ఇటీవల వెల్లడైన తీర్పు గురించి అందరికీ తెలిసిందే. అయితే అసలు ఈ కేసును విచారించేందుకు, జయలలిత అండ్ కోను జైలుకు పంపినందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా? సమాచార హక్కు చట్టం ద్వారా, కర్ణాటక సర్కార్ లిఖితపూర్వకంగా తెలిపిన సమాధానంతో ఈ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2004లో తమిళనాడు నుంచి ఈ కేసు కర్ణాటకకు బదిలీ కాగా, 2004 నుంచి 2014 వరకు పరప్పణ అగ్రహార జైలులో ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు.
అలాగే ఈ కేసు విచారణ సందర్భంగా చెలరేగిన అల్లర్లను అడ్డుకునేందుకు, కేటాయించిన సిబ్బంది, న్యాయశాఖ ఖర్చు… ఇలా అన్ని కలిపి కర్ణాటక ప్రభుత్వం ఏకంగా 3.93 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపింది. ప్రత్యేక న్యాయస్థానం వద్ద పోలీసు భద్రత, జయలలిత, ఇతర నిందితులు వచ్చి వెళ్లినప్పుడు ఏర్పాటు చేసిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అధికారులు, సిబ్బంది వేతనాలు, ఇతర భత్యాల రూపంలో 90.13 లక్షల రూపాయలు చెల్లించారు. ఇందులో 2.36 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా, మిగిలిన మొత్తాన్ని న్యాయ, హోం శాఖలు తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమచేశాయని తెలిపారు.



