కేవలం 251 రూపాయలకే స్మార్ట్ ఫోన్ ఇస్తామంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ‘రింగింగ్ బెల్స్’ కంపెనీ డైరెక్టర్ మోహిత్ గోయల్ తాజాగా అరెస్ట్ అయ్యారు. 16 లక్షల మోసానికి పాల్పడినట్టు ఘజియాబాద్ లోని ‘అయాం ఎంటర్ ప్రైజెస్’ యజమాని బుధవారం మోహిత్ పై ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం మోహిత్ ను అదుపులోకి తీసుకున్నామని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ మనీష్ మిశ్రా తెలిపారు. ఈ కేసు 251 రూపాయల మొబైల్ పంపిణీకి సంబంధించి కావడం విశేషం.
ఫ్రీడం 251 స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసే బాధ్యతలు తీసుకోవాలంటూ నవంబరు 2015లో రింగింగ్ బెల్స్ ప్రతినిధులైన గోయల్ తదితరులు తనను కోరినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వివిధ సందర్భాల్లో రింగింగ్ బెల్స్ కు 30 లక్షలు చెల్లిస్తే, తమకు మాత్రం 13 లక్షల విలువైన ఉత్పత్తులు మాత్రమే ఇచ్చారని, ఆ తర్వాత తమ ఒత్తిడితో మరో లక్ష రూపాయల ఉత్పత్తులు ఇచ్చారని పేర్కొన్నారు. మిగిలిన 16 లక్షల గురించి ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.



