ఆ ఇద్దరి బంధం వైసీపీ కి లక్ష్మణ రేఖేనా..?

Friendly Bond Between Chandrababu Naidu & Pawan Kalyan

ఒకరి నిర్బంధం తో కలిసిన బంధం ఎంత బలంగా, స్థిరంగా ఉంటుందో అని చెప్పడానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య ఏర్పడిన స్నేహబంధమే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు.

ఈ ఇద్దరు అధినేతలు పార్టీల పరంగా రెండు జెండాలను మోస్తున్నప్పటికీ వీరి ఎజెండా మాత్రం ఒక్కటే అనేలా వ్యవహరిస్తున్నారు. ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరొకరు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను పంచుకోవడమే కాదు ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవిస్తూ, ఒకరి ఆలోచనలను మరొకరు ఆచరిస్తూ రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతున్నారు.

ADVERTISEMENT

చంద్రబాబు అనుభవం, పవన్ ఆలోచనలు టీడీపీ, జనసేన ల బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య, ఈ రెండు పార్టీల నడుమ మొదలైన ఈ స్నేహ బంధం ఇలా పటిష్ఠంగా కొనసాగగలిగితే వీరు ప్రతిపక్షంగా వైసీపీ పార్టీకి గీసిన లక్ష్మణ రేఖ ను జగన్ ఎప్పటికి దాటలేరు అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది.

బాబు అనుభవం ఆంధ్రపద్రేశ్ అభివృద్ధికి మార్గదర్శకం అంటూ పవన్ పదేపదే చేస్తున్న ప్రకటనలు కూటమి బంధం పై జనసైనికులకు పరోక్ష సంకేతాలు కాగా ప్రత్యర్థి వైసీపీ కి కీలక హెచ్చరికలుగానే భావించాలి.

అలాగే కష్టకాలంలో పార్టీకి, తనకు పవన్ ఇచ్చిన మద్దతు ఎప్పటికి మరిచిపోలేనిది అంటూ బాబు చేస్తున్న వ్యాఖ్యలు కూటమి బలోపేతానికి తెలుగు తమ్ముళ్లకు ఇస్తున్న సూచనలు కాగా అవి వైసీపీ అధికార దాహానికి వేస్తున్న సంకేళ్లుగానే పరిగణించాలి.

ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించి, ఈ ఇద్దరి నాయకుల నడుమ చీలిక ఏర్పరచి దాని ద్వారా రాష్ట్రంలో వచ్చే రాజకీయ వైరాలతో వైసీపీ రాజకీయ లబ్ది పొందాలని ఆశిస్తుంది. కానీ వైసీపీ ఆశలను, జగన్ ఆకాంక్షలను బాబు, పవన్ లు ఎప్పటికప్పుడు తమ మైత్రి బంధంతో వాటిని పటాపంచలు చేస్తూనే వస్తున్నారు.

అయితే ఒక నిస్సహాయత, ఒక నిర్బంధం కలిస్తే ఒక నియంతను పాతాళానికి తొక్కొచ్చు అనేలా టీడీపీ, జనసేన బంధం వైసీపీ ని అదః పాతాళానికి తొక్కింది. అలాగే బాబు, పవన్ ల బంధం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కు శ్రీ రామ రక్ష కాగా వైసీపీకి, జగన్ కు అది లక్ష్మణ రేఖే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories