గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పేరు వినడానికి కూడా అవకాశం దక్కని ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 వారాలలోనే ఇది కేంద్ర బడ్జెట్టా? ఏపీ బడ్జెట్టా? అంటూ దేశం మొత్తం చర్చించుకునే స్థాయిలో ఏపీకి నిధులు సేకరించింది కూటమి ప్రభుత్వం.
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అనేలా వైసీపీకి దాని అనుబంధ సంస్థలైన నీలి మీడియాకు నిధులు కూడా నేరంగా కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా తమ ప్రభుత్వం చెయ్యలేని, తమ నాయకుడికి చేతకాని పనిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు వారాలలో పూర్తి చేయడంతో వైసీపీ రాష్ట్రంలో తన అస్తిత్వాన్ని కోల్పోతుందా అనే భయంలో ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టారు.
ఇక ఏపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల మీద రాష్ట్రంలో చర్చ జరగకూడదు అనే ఉద్దేశంతో నిన్న ఢిల్లీ కేంద్రంగా జగన్ చేసిన రాజకీయం వైసీపీ ‘వై నాట్ 175 ‘ నినాదం మాదిరి బెడిసికొట్టింది. కూటమి ప్రభుత్వ రాజకీయ కక్ష్యలో ఏపీ నలిగిపోతుంది అంటూ హస్తినలో జగన్ చేసిన హడావుడిని పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. ఒక్క అఖిలేష్ యాదవ్ మినహాయించి జగన్ కు మద్దతు తెలపడానికి ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదు.
అంతెందుకు వైసీపీ ఆత్మ మిత్రులు బిఆర్ఎస్ నాయకులు కూడా జగన్ కు సంఘీభావం తెలపలేకపోయారు. అలాగే జగన్ ఆరోపిస్తున్నట్టుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ హత్యలకు
బాధితులుగా చెప్పబడిన వారు సైతం జగన్ వెంట నిలవలేక పోయారు. కనీసం 175 నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థులుగా పోటీలో నిలబడిన నేతలు సైతం జగన్ కు ముఖం చాటేశారు.
దీనితో జగన్ తనను తానూ డిఫెన్స్ చేసుకోవడానికే, అసెంబ్లీ నుండి పారిపోవడానికి ఒకసాకుగా ఈ నిరశన యాత్రలకు శ్రీకారం చుట్టారనేది స్పష్టమైపోయింది. తానూ సమాధి చేసిన ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 15 వేల కోట్ల నిధులతో మహర్దశ పట్టనుండడంతో వైసీపీని కూటమి ప్రభుత్వం పరోక్షముగా కోలుకోలేని దెబ్బ కొట్టినట్టయ్యింది.
తన ప్రభుత్వం అప్పులు చేసి హామీలను నెరవేరిస్తే ఇప్పటి ప్రభుత్వం అభివృద్ధి చేసి, ఆదాయం సృష్టించి హామీలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే అమరావతి నిర్మాణం నుండి పోలవరం పూర్తి వరకు, రోడ్ల విస్తరణ నుండి ఎయిర్ పోర్టుల స్థాపన వరకు, పెట్టుబడుల వేట నుండి పారిశ్రామిక వేత్తల రాక వరకు ఇలా అన్ని విధాలా ఏపీని ముందుకు తీసుకు వెళ్ళడానికి కేంద్ర సహకారంతో కలిసి ఒక్కోఅడుగు వేస్తుంది కూటమి ప్రభుత్వం.
రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం వేసే ఒక్కో అడుగు వైసీపీ ని పదడుగులు కిందకు తొక్కినట్టే. దీనితో ఏపీకి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులిచ్చినా, పారిశ్రామిక వేత్తల నుండి పెట్టుబడులొచ్చినా ,పరిశ్రమల నుండి యువతకు ఉపాధి వచ్చినా వైసీపీకి దిగులు మొదలవ్వడం ఖాయంగా కనపడుతుంది. ఇది గమనించిన జగన్ ఏపీ బ్రాండ్ వాల్యూ ని మరికాస్త తగ్గించడానికి తానూ ఇంకాస్త దిగజారుతున్నారు.




