శనివారం సాయంత్రం రాజమండ్రి శివారులో వేమగిరి వద్ద గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగబోతోంది. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా పాల్గొనబోతున్నారని దిల్రాజు ఇదివరకే చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారని సమాచారం. దిల్రాజు, దర్శకుడు శంకర్లతో సహా ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నట్లు సమాచారం.
ఉమ్మడి కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు సినిమాలపై ఎంత మోజో అందరికీ తెలిసిందే. కనుక గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఈరోజు ఉదయం నుంచే కార్లు, బైకులు వేసుకొని పెద్ద ఎత్తున అభిమానులు రాజమండ్రి చేరుకుంటున్నారు.
ఈ కార్యక్రమానికి సుమారు లక్షన్నర మందికి పైగా అభిమానులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు, పోలీసులు అంచనా వేసి, అందుకు తగ్గట్లుగా చాలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
సంధ్య థియేటర్ ఘటనని దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 1,200 మంది పోలీసులను మోహరించారు. ఎస్సై, సీఐ స్థాయి అధికారులు మరో 400 మంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చెన్నై నుంచి ఒడిశా మీదుగా కోల్కత్తావైపు రాకపోకలు సాగించే వాహనాలను వేమగిరి, బొమ్మూరు వద్ద జాతీయ రహదారిపై వేరే మార్గాలకు మళ్ళిస్తున్నారు.
ఇదివరకు ఇటువంటి కార్యక్రమాలు హైదరాబాద్లో చాలా అట్టహాసంగా జరిగేవి. కానీ సినీ పరిశ్రమ పట్ల తెలంగాణ ప్రభుత్వం కటువుగా వ్యవహరిస్తునందున, ఈ ఈవెంట్ రాజమండ్రికి తరలివచ్చేసింది.
ఈ కార్యక్రమం ఎలాగూ విజయవంతం అవుతుంది. కనుక రాబోయే రోజుల్లో మరిన్ని సినిమా కార్యక్రమాలు ఏపీలోనే నిర్వహించే అవకాశం ఉంది.
హైదరాబాద్లో జరగాల్సిన ఇటువంటి పెద్ద కార్యక్రమాలు ఏపీకి తరలిపోతుంటే ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయం, ఆంక్షలపై పునరాలోచన చేస్తుందా లేదా టాలీవుడ్ చెయ్యి పట్టుకొని ఏపీకి సాగనంపుతుందో?




